మాస్ టెస్ట్: షర్మిల, కవితలా లోకేష్ దూసుకెళ్తారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రజలకు, పార్టీ కిందిస్థాయి కార్యకర్తలకు దగ్గర కావడంలో విజయవంతం కాలేకపోయారా? అంటే అవుననే అంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేస్తారని కొంతకాలం క్రితం వరకు జోరుగా ప్రచారం సాగింది. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన కేవలం ప్రచారానికే పరిమితం కానున్నారు. ఈ నెల 12వ తేదీ నుండి నారా లోకేష్ ప్రచార బరిలోకి దిగనున్నారు.
అయితే, లోకేష్ ప్రజల దగ్గరకు చేరడంలో విజయవంతం కాలేకపోయారంటున్నారు. 12వ తేదీ నుండి ప్రారంభమయ్యే ప్రచారం ద్వారా ఆయన ఏ మేరకు విజయం సాధించారో అర్థమవుతుందంటున్నారు. నారా లోకేష్ ఇప్పటి వరకు సభలలో మాట్లాడింది దాదాపు లేదనే చెప్పవచ్చు. భారీ సభలో ఆయన ఎలా మాట్లాడుతారనే విషయం ఇప్పటికీ తెలియదు. ఇటీవలి వరకు ఆయన పలు జిల్లాల నాయకులతో, పార్టీ యువ నేతలతో, కుప్పం కార్యకర్తలతో మాత్రమే భేటీ అయ్యారు. కానీ బయటకు మాత్రం రాలేదు.
ఇప్పుడు బయటకు వస్తున్న లోకేష్ ప్రజలను ఆకట్టుకుంటారా అనే చర్చ సాగుతోంది. సాధారణంగా లోకేష్ది సిగ్గుపడేతత్వమట. మాట్లాడేతత్వం కంటే ఇతరులు చెప్పేది వినడం, ఓపిక లోకేష్కు ఎక్కువగా ఉన్నాయంటారు. ప్రచార పర్వంలోకి దూకుతున్న లోకేష్ అందుకు అనుగుణంగా సిద్ధమయ్యారట.
నారా లోకేష్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి, షర్మిల, తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావు, కూతురు కల్వకుంట్ల కవితలు మాస్ను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారని, ఇప్పుడు నారా లోకేష్ అందులో విజయవంతమౌతారా అనే చర్చ సాగుతోంది.
వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి లోకసభకు పోటీ చేసినప్పుడు కొంత తండ్రి చాటు బిడ్డ అయినప్పటికీ... వైయస్ మృతి తర్వాత, పార్టీని స్థాపించిన తర్వాత మాస్లో దూసుకెళ్తున్నారు.
షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఉప ఎన్నికల ప్రచారం ద్వారా బయటకు వచ్చారు. ఆమె హావభావాలు తండ్రిలా ఉన్నాయని ప్రశంసలు అందుకున్నారు.
కెటి రామారావు
తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు కెటి రామారావు సిరిసిల్ల నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కెటి రామారావుతో పాటు కెసిఆర్ అల్లుడు హరీష్ రావులు తమ చతురతతో తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
కల్వకుంట్ల కవిత
తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్నారు.