షాక్: ట్రంప్పై కోర్టుకు ఐటి దిగ్గజాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదస్పద చర్యలు, వ్యాఖ్యలపై ఇప్పటివరకు విమర్శలు, వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైన ఫేస్బుక్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికాలోని 127 దిగ్గజ ఐటీ కంపెనీలు .
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదస్పద చర్యలు, వ్యాఖ్యలపై ఇప్పటివరకు విమర్శలు, వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైన ఫేస్బుక్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికాలోని 127 దిగ్గజ ఐటీ కంపెనీలు న్యాయ పోరాటానికి దిగాయి.
ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాస్పద ఉత్తర్వులపై న్యాయస్థానాల తలుపు తట్టాయి. పిటిషన్లు దాఖలుచేసిన ఇతర కంపెనీల్లో ఈబే, ఇంటెల్తోపాటు లెవీ స్ట్రాస్, చోబని తదితర నాన్ ఐటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలకు ట్విట్టర్, నెట్ఫ్లిక్స్, ఉబెర్ తదితర కంపెనీలు కూడా మద్దతు పలికాయి. అమెరికా ఆర్థికవ్యవస్థలో విదేశాల నుంచి వలస వచ్చినవారి పాత్ర గణనీయమేనని తమ పిటిషన్లలో స్పష్టం చేశాయి.
అకస్మాత్గా ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించడంతో అమెరికాలోని కంపెనీలపై గణనీయంగా హాని కలుగుతుందని శాన్ఫ్రాన్సిస్కోలోని 9వ అప్పీళ్ల సర్క్యూట్ కోర్టుకు ఆదివారం, సోమవారం సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నాయి. ఆ ఏడు దేశాల పౌరులపై ప్రయాణాలపై నిషేధంపై రద్దును తక్షణమే ఎత్తివేయాలని ట్రంప్ యంత్రాంగం చేసిన విజ్ఞప్తిని ఆదివారం ఇదే కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
సిలికాన్ వ్యాలీలో విదేశీ ఉద్యోగులు 37%
సిలికాన్ వ్యాలీలో ఉన్న ఉద్యోగుల్లో జన్మతః విదేశీయులు దాదాపు 37% మంది ఉంటారని అంచనా. ప్రస్తుతం అమెరికా కోర్టుల్లో ట్రంప్ ఉత్తర్వులు ఇప్పటికే ఆటంకాలు ఎదుర్కొంటున్ననేపథ్యంలో ఐటీ కంపెనీల తాజా నిరసన స్వరం ఇది. ముస్లింలు అధికంగా గల ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలపై ట్రంప్ విధించిన ఆంక్షలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ఉత్తర్వులను ఫెడరల్ జడ్జి గత శుక్రవారం నిలిపివేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ముందు ఇరు పక్షాలు తమ వాదనలను దాఖలు చేయాలన్న అప్పీళ్ల కోర్టు ఆదేశం మేరకే ఐటి సంస్థలు అప్పీళ్లు దాఖలు చేశాయి.
ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 40% వలస వాదులవే
ఫార్చ్యూన్-500 కంపెనీల్లో 200కుపైగా కంపెనీలు వలస వచ్చినవారు.. వారి సంతతి సృష్టించినవేనని తెలిపాయి. గతవారంలోనే అమెజాన్, ఎక్స్పీడియా కంపెనీలు వాషింగ్టన్ అటార్నీ జనరల్ ముందు కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమ కంపెనీలను, వ్యాపారాలను ట్రంప్ ఉత్తర్వులు తీవ్రంగా దెబ్బతీస్తాయని తమ ఫిర్యాదుల్లో ఈ కంపెనీలు పేర్కొన్నాయి. దేశ ఆర్థికవ్యవస్థలో విదేశీయుల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పాయి. అమెరికాలో జరిగిన పలు గొప్ప ఆవిష్కరణలకు వలస వచ్చిన విదేశీయులే కారణమని, దేశపు సృజనాత్మక కంపెనీలను వారు సృష్టించారని పేర్కొన్నాయి.
ట్రంప్ అనుకూల, వ్యతిరేక నిరసనల పోటాపోటీ
ట్రంప్ వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలు మాన్హట్టన్లోని ఆయన వ్యక్తిగత నివాసం, కార్యాలయం గల ట్రంప్ టవర్ వెలుపల సాగాయి. ఇరు పక్షాలు పరస్పరం నినాదాలు చేస్తుండగా ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా. పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను విడదీశారు. ఎముకలు కొరికే చలిలోనూ తొలిసారి ట్రంప్ అనుకూలవర్గాలు ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రయాణాలపై ఆంక్షలను సమర్థించిన ట్రంప్ అనుకూల ప్రదర్శకులు.. కొత్త అధ్యక్షుడికి ఒక అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నారు. ట్రంప్ శకానికి స్వాగతం అని తెల్లటి భారీ బ్యానర్ను వారు ప్రదర్శించారు. మరోవైపు ట్రంప్ వ్యతిరేకులు నిషేధం వద్దు.. గోడలు వద్దు! వలసవాదులకు స్వాగతం అని రాసి ఉన్న బ్యానర్ను ప్రదర్శించారు.
పనికిమాలిన చెత్త కథతో రీమేక్
కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై హాలీవుడ్ దిగ్గజ దర్శకులు అలెజాండ్రో గొంజాలెజ్ ఇనార్రిటు, డామెయిన్ చాజెల్లి, డెనిస్ విల్లేన్యువె పరోక్ష విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం రాస్తున్న కథ చాలా పనికిమాలిందని అందరికీ తెలుసునన్నారు. శతాబ్దిలో అత్యంత చెత్త కథల్లో ఒకదాన్ని రీమేక్ చేస్తున్నారని మండిపడ్డారు. మంచి, మిశ్రమ, నిజమైన మానవ కథలను చెప్పడం ద్వారా మాత్రమే అందరి మనస్సులను చూరగొనగలమన్నారు. చాజెల్లీకి ‘డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డ్'ను ఆస్కార్ విజేత ఇనార్రిటు బహుకరించారు.
నిషేధం వల్ల ఆస్కార్ అవార్డులకు ఫర్హాది దూరం: చాజెల్లీ
ఈ అవార్డు అందుకుంటున్నందుకు ఒక దర్శకుడిగా, ఒక మెక్సికన్గా, ఎంతగానో గర్విస్తున్నాను అని చాజెల్లీ చెప్పారు. ఇరాన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హాది సినిమాల నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ప్రస్తుత నిషేధం వల్ల ఆయన ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రాలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. అరైవల్ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ పొందిన ఫ్రెంచ్-కెనడియన్ దర్శకుడు విల్లేన్యువె మాట్లాడుతూ రోజూ ఉదయమే లేవగానే తన వీసా చట్టబద్ధంగా ఉందా? లేదా? అని సరిచూసుకోవడమే తాను చేసే మొదటి చర్య అని వ్యంగ్యాస్త్రం సంధించారు.