మోడీకి సెగ: అఖిలేశ్, మాయావతి ఏకం, లాలూ ‘సై’
ఆగస్టు 27వ తేదీన బీహార్ రాష్ట్ర రాజదాని పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించనున్న ప్రదర్శనలో పాల్గొనేందుకు బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు
లక్నో: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యూపీలో బద్ధ శత్రువులు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ). కానీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయానికి గురయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ముందు నిలబడలేక విలవిలలాడుతున్నాయి.
రాజకీయ పూర్వవైభవం కోసం ఎస్పీ, బీఎస్పీ అధినేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి. అందులో భాగంగా వచ్చే ఆగస్టు 27వ తేదీన బీహార్ రాష్ట్ర రాజదాని పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్వహించనున్న ప్రదర్శనలో పాల్గొనేందుకు బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు - యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సిద్ధం చేశారు.
హిందీ రాష్ట్రాల బెల్టులో నూతన రాజకీయ పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఇద్దరూ ఆగస్టు 27వ తేదీన జరిగే ప్రదర్శనలో పాల్గొనేందుకు అంగీకరించారని ఆర్జేడీ యూపీ శాఖ అధ్యక్షుడు అశోక్ సింగ్ తెలిపారు. తాను నిర్వహించే ప్రదర్శనకు హాజరు కావాలని తమ అదినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా వారిద్దరికీ ఫోన్ చేసి ఆహ్వానించారని చెప్పారు.
బీజేపీయేతర రాజకీయాలకు ఇలా శ్రీకారం
ఎస్పీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ను ఆహ్వానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 2014 లోక్సభ, ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు సాధించిన బీజేపీ వ్యతిరేక పార్టీలు నూతన రాజకీయాలకు శ్రీకారం చుడ్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పాట్నా ర్యాలీకి లాలూ ఇలా ఏర్పాట్లు
పశ్చిమ బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతాబెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి - బిజూ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తదితరులను కూడా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారని అశోక్ సింగ్ తెలిపారు.
హాజరయ్యేందుకు ఎంకే స్టాలిన్ ఓకే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతినిధిని పంపుతారని భావిస్తున్నామని ఆర్జేడీ యూపీ శాఖ అధ్యక్షుడు అశోక్ సింగ్ తెలిపారు. ఇక డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా పాట్నా సదస్సుకు హాజరు కానున్నట్లు ధ్రువీకరించారని చెప్పారు.
మహా కూటమి ఏర్పాటు సన్నాహాలు ఇలా
ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు బీహార్ తరహాలో జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాట్లకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీ అధినేతలు అఖిలేశ్, మాయావతిలను ఒక్కదగ్గరకు చేర్చేందుకు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పూనుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు పార్టీలు ఒక్కటైతే యూపీతోపాటు దేశ రాజకీయాల్లోనూ గణనీయ పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. దళితులు, యాదవ్లు, బలహీన వర్గాల ఓట్లను సమర్థవంతంగా సంఘటితపరిచేందుకు వీలు చిక్కుతుందని భావిస్తున్నారు.
ఎస్పీ 47 స్థానాలకే పరిమితం
403 స్థానాలు గల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో మాయావతి సారథ్యంలోని బీఎస్పీ కేవలం 19 స్థానాలతో సరిపెట్టుకున్నది. 2012లో 80 స్థానాల్లో గెలుపొందిన బీఎస్పీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. 1991 నుంచి బీఎస్పీకి అతి తక్కువ స్థానాలు రావడం ఇదే మొదటి సారి. ఇక ఎస్పీ కూడా 47 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇది 1992 నుంచి అతి తక్కువ స్థానాలు. 2007లో ఎస్పీ 97 స్థానాల్లో గెలుపొందింది.
ఎస్పీ, బీఎస్పీ కలిస్తే కీలక పరిణామాలు
ఎస్పీకి 21.8 శాతం, బీఎస్పీకి 22.2 శాతం ఓట్లు లభించాయి. బీఎస్పీ అన్ని స్థానాలకు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి 105 స్థానాలకు మిగతా స్థానాల్లో ఎస్పీ పోటీ చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 25 శాతం ఓటింగ్ పెంచుకుని 40 శాతం ఓట్లు పొందింది. తద్వారా ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి 325 స్థానాలను గెలుచుకున్నది. కాగా పాట్నా ర్యాలీకి హాజరు కానున్నట్లు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ధ్రువీకరించారు. ఆగస్టు 27న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగే ర్యాలీలో పాల్గొని భవిష్యత్ రాజకీయాలపై ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటే చేస్తానన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ ఏర్పాటు చేసిన 16 విపక్ష పార్టీల సమావేశానికి కూడా అఖిలేశ్ యాదవ్, మాయావతి హాజరయ్యారు.
మాయావతి, ములాయం మధ్య ఇలా విభేదాలు
ఎస్పీ, బీఎస్పీ 1993లో కూటమిగా పోటీ చేశాయి. బీఎస్పీ 164 స్థానాలకు పోటీ చేసి 67, 256 స్థానాల్లో పోటీ చేసిన ఎస్పీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అప్పటికి ఉత్తరాఖండ్ రాష్ట్రం విభజించలేదు. దీంతో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ బీఎస్పీ అధినేత మాయావతి మద్దతు ఉపసంహరించుకోవడంతో రెండు పార్టీలు వైరి పక్షాలుగా నిలిచాయి. 1995లో బీజేపీ మద్దతుతో మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
రాజ్యసభకు మాయాను పంపేందుకు లాలూ సిద్ధం
కానీ ప్రస్తుతం సొంత బలంపై మాయావతి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు లేవు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆమె పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆమె రాజకీయ భవితవ్యాన్ని పరిరక్షించేందుకు మాయావతిని రాజ్యసభకు పంపుతామని ప్రకటించారు.