వెంకయ్య కొత్త ఈక్వేషన్ అదుర్స్: లాజిక్ మరిచారా?
విజయవాడ: కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు కొత్త ఈక్వేషన్ చెప్పారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు పాల్గొనలేకపోతున్నానో చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు.
వెంకయ్య నాయుడుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని విమర్శకులు అంటుంటారు. ఆయన గత నాలుగుసార్లు పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఆయన పైన వ్యతిరేక పక్షాలు.. విమర్శలు చేస్తుంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకు అంటుంటారు.
దీనిపై ఆయన గురువారం నాడు సరైన కౌంటర్ ఇచ్చారు. ప్రత్యక్ష రాజకీయాలు అయితే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవుతామని, కానీ రాజ్యసభ అయితే అన్ని ప్రాంతాలకు చెందిన వారమవుతామని ఆయన ఓ లాజిక్ చెప్పారు.
తాను రాజ్యసభకు పోటీ చేయనని తన పని అయిపోయిందని రకరకాలుగా మీడియా ప్రచారం చేసిందన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తాను ఎక్కడ నుంచి అయినా పోటీ చేసే వెసులుబాటు ఉందని ఆయన చెప్పడం గమనార్హం.
తాను ఏపీ నుంచి, రాజస్థాన్ నుంచి, కర్నాటక నుంచి.. ఇలా అన్ని ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించినట్లు అవుతుందని ఆయన చెబుతున్నారు. అయితే, రాజ్యసభకు ఏ ప్రాంతం నుంచి వెళ్తే ఆ ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
లేదంటే, స్థానిక రాజకీయ నాయకులు ఏదైనా సమస్య పైన వారినే పదేపదే నిలదీస్తుంటారు. ఇందుకు ఎన్నో అనుభవాలు కూడా ఉన్నాయి. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారు. ఈసారి కర్నాటక నుంచి పంపించారు.

దానికి ప్రత్యేక హోదానే కారణమనే వాదన ఉంది. నిర్మలా సీతారామన్ను మరోసారి ఏపీ నుంచి పంపిస్తే.. కేంద్రం హోదా ఇవ్వకుంటే ఆమె రాజీనామాకు ఏపీ రాజకీయ నాయకులు, ప్రజలు పట్టుబట్టే అవకాశముందని, అందుకే ఆమెను కర్నాటక నుంచి పంపించారనే వాదన ఉంది. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే.. వ్యతిరేకత తప్పించుకునేందుకు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఏపీ నుంచి దించారనే వాదనలు ఉన్నాయి.
అంతేకాదు గతంలో ఆయన ఎప్పుడు విశాఖ వెళ్లినా.. ఇక్కడే చదువుకున్ననని, ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నానని చెబుతుంటారు.
తనకు విశాఖతో ఆ అనుబంధం ఉందని అంటుంటారు. ఇప్పుడు విజయవాడతోను తనకు ఎంతో అనుబంధం ఉందని, విజయవాడలోనే నేను అరెస్టు అయ్యానని, కళలు,రాజకీయాలు, మీడియా, ఇలా అన్నింటికి నెంబర్ వన్ విజయవాడే చెప్పారు. వెంకయ్య మాటకారి, అని తాజా వ్యాఖ్యలతో మరోసారి నిరూపితమైందంటున్నారు.
అదే సమయంలో, ఆయన సీఎం చంద్రబాబుకు ఓ సూచన కూడా చేశారు. నదుల అనుసంధానం ముందుచూపుతో చేసే ప్రక్రియ అని దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని దీనికి చంద్రబాబును అభినందిస్తున్నానన్నారు.
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వికేంద్రీకరణ జరగాలని సూచించారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలని ప్రతి పథకం తమదేనన్న భావన రావాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరగడం వల్ల రాజ్యసభలో గట్టిగా పోరాడానని చెప్పారు. హైదరాబాదులా అభివృద్ధిని విజయవాడలో కేంద్రీకరించవద్దని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications