వెంకయ్య గూడార్థం: 'చిరు' గాలం, పవన్ది మరోదారే!
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. 2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలోకి రావడమే లక్ష్యమని బీజేపీ చెబుతోన్నప్పటికీ... అధికారంలోకి రాకపోయినప్పటికీ ఆయా రాష్ట్రాలలో తెరాస, టీడీపీలను ధీటుగా ఎదగడమే టార్గెట్ పెట్టుకుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అండతో ముందుకు సాగుతున్న బీజేపీ.. తాజాగా చిరంజీవి అభిమానులకు కూడా గాలం వేస్తోంది.
ఆదివారం నాడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరులో జరిగిన సంక్రాంతి వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. పవన్ రాక విషయం తెలిసి భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. దీంతో ప్రాంగణం కళకళలాడింది. ఈ సందర్భంగా వెంకయ్య చిరు పైన ప్రశంసలు కురిపించారు.

తెలుగు పరిశ్రమకు చిరు మూడో కన్నువంటి వాడని కితాబిచ్చారు. వెంకయ్య మాటల్లో గూడార్థం ఉందని అంటున్నారు. చిరంజీవిని వెంకయ్య పొగడటం వెనుక పవన్ కళ్యాణ్, మెగా అభిమానులను మచ్చిక చేసుకోవడమేనని అంటున్నారు. వెంకయ్య కితాబుకు ఇవే కారణమని, ఆయన పొగడటం కాదని... పొగిడే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
కాగా, బీజేపీ, పవన్ కళ్యాణ్ దోస్తీ ఇకముందు కూడా సాగనున్నదనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. వెంకయ్య పిలుపుకు పవన్ సానుకూలంగా స్పందించడం, మోడీ స్వచ్ఛ భారత్కు పవర్ స్టార్ కితాబివ్వడం చూస్తుంటే దోస్తీ కొనసాగుతుందని అర్థమవుతోంది.
అయితే, చిరంజీవిలాంటి పొరపాటును మాత్రం పవన్ కళ్యాణ్ చేయకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయకుండా.. దోస్తీ చేస్తే ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఉండేదనే వ్యాఖ్యలు పలుమార్లు వినిపించాయి. చిరును గమనించిన పవన్.. తన పార్టీని బీజేపీలో విలీనం చేయకుండానే దోస్తీ కొనసాగించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications