ప్రశాంత్ కిశోర్ టార్గెట్: ఆయనపై కేసుకు టిడిపి యోచన
నంద్యాల అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారు.
విజయవాడ: నంద్యాల అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేశారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ప్రశాంత్ కిశోర్ సూచన మేరకే జగన్ నంద్యాల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు భావిస్తన్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
జగన్ను కట్టడి చేయడానికి ప్రశాంత్ కిశోర్ను చిక్కుల్లో పడేయడం అవసరమని కూడా భావిస్తున్నట్లున్నారు. ఇందులో భాగంగానే ఆయనపై పోలీసు కేసు పెట్టాలని తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
నకిలీ ఖాతాలు తెరిచారా...
ప్రశాంత్ కిశోర్ జట్టు సోషల్ మీడియాలో వేల నకిలీ ఖాతాలను తెరిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టింగులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అందుకుగాను ప్రశాంత్ కిశోర్పై సైబర్ చట్టం కింద కేసు నమోదు చేయాలని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శుక్రవారం డిమాండ్ చేశారు.
Recommended Video
యుపిలోనూ కేసులు....
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్పై ఏడు కేసులు నమోదయ్యాయని, ఇందులో ఒకటి సైబర్ కేసు అని వర్ల తెలిపారు. ఆ కేసుల వివరాలు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రశాంత్ కిషోర్, జగన్ చేసే పనులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. జగన్ లాగే ప్రశాంత్ కిషోర్ కి క్రిమినల్ చరిత్ర ఉందని అన్నారు.
అఖిలేష్ను మోసం చేసి...
యూపీలో అఖిలేష్ యాదవ్ని మోసం చేసి ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయి వచ్చాడని వర్ల రామయ్య అన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని అన్నారు. జగన్, ప్రశాంత్ కిషోర్ లపై డీజీపి నిఘా పెట్టాలని కోరారు. ప్రశాంత్ కిషోర్ జట్టులో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో తెలుసుకోవాలని, ఇద్దరూ కలిసి ఏదో కుట్ర చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని, కుట్రని అడ్డుకోవాలని వర్ల రామయ్య అన్నారు.
ప్రశాంత్ కిశోర్ సలహానే...
ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని కన్సల్టెంట్ పీకే చెప్పినట్లున్నారు గానీ ఎన్ని తిట్లు తిడితే అన్నివేల ఓట్లు పోతాయనేది తెలుసుకోవాలని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైసిపి అధినేత జగన్ను భరించలేక ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీకి వెళ్లిపోయారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శుక్రవారం ఎద్దేవా చేశారు.