ఇంద్రాణిపై డైరీలో షీనా బోరా 'తల్లి కాదు దెయ్యం'
ముంబై: గత కొద్ది రోజులుగా షీనా బొరా హత్య కేసు మీడియాలో వేడి పుట్టిస్తున్న విషయం తెలిసిందే. షీనా బొరా హత్య కేసులో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షీనా బొరాకు డైరీ రాసే అలవాటు కూడా ఉంది. తన తల్లి ఇంద్రాణిని ఆమె ఎంతగా అసహ్యించుకుందో ఆ డైరీలోని విషయాలు బయటపెడుతున్నాయి.
ఇంద్రాణికి, షీనా బొరాకు మధ్య జరిగిన ఈ మెయిల్ సంభాషణలు వేడివాడిగా జరిగిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తన తండ్రి సిద్ధార్థ్ దాస్ చెంత తాను ఉండకపోవడంతో షీనా బొరా చాలా విషాదానికి గురైనట్లు, వచ్చి తనను చూడాలని ఆమె పదే పదే సిద్ధార్త్ ధాస్ను కోరినట్లు ఆమె డైరీలను బట్టి అర్థమవుతోంది.
డాడీని అడ్రస్ చేస్తూ ఆమె చాలా రాసింది. తన కష్టాలను, తన మనోభావాలను ఆమె తన డైరీలో పెట్టింది. భవిష్యత్తు చదువుకు సిద్ధార్థ్ నుంచి డబ్బులు ఆశించినట్లు కూడా డైరీలో రాసిన విషయం బయటపెడుతోంది. సిద్ధార్థ్ దాస్ పట్ల అత్యంత ఇష్టాన్ని, ఆయనను తన గ్రాండ్ పేరెంట్స్ ఇష్టపడకపోవడం పట్ల అగ్రహాన్ని షీనా బోరా డైరీల్లో వ్యక్తం చేసింది.
తన తల్లి న్యూస్ రిపోర్ట్స్ క్లిప్పింగ్స్ను కూడా షీనా బొరా దాచిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. తన ఒంటరితనం పట్ల ఆమె తీవ్రంగా ఆవేదన చెందినట్లు కూడా డైరీ రాతలను బట్టి అర్థమవుతోంది. అన్ని వైపుల నుంచి డిప్రెషన్ ముంచేస్తోందని, భవిష్యత్తు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, తన తల్లిని అసహ్యించుకుంటున్నానని రాసింది. ఆమె తల్లి కాదు, మంత్రగత్తె అని వ్యాఖ్యానించింది.
ఇంద్రాణి పీటర్ ముఖార్జియాను పెళ్లాడడాన్ని షీనా బొరా ఇష్టపడలేదు. ఇప్పుడు ఆమె ఆ ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ వ్యాఖ్యానించింది. తనలో అంతులేని వేదన ఉందని, బిగ్గరగా ఏడ్వాలని ఉందని, అయితే ఎక్కడా ఎవరి ముందు అంటూ నిరాశచెందింది.
షీనా బొరాకు, ఇంద్రాణికి మధ్య దాదాపు 20 ఈ మెయిల్స్లో తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. షీనా హత్యకు ఈ వివాదం కారణమై ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.