గ్రేటర్ జిమ్మిక్కు, మార్పు! టాలీవుడ్కు తలసాని హామీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి... హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో పడింది. గత కొద్ది రోజులుగా తెరాస నాయకుల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు నిత్యం హైదరాబాదు ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని మాట్లాడుతూ... టాలీవుడ్ పరిశ్రమకు తమ ప్రభుత్వం సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. దాదాపు నిత్యం రెండు వందల సినిమాల షూటింగులు జరుగుతుంటాయన్నారు. అందరికీ తమ సహకారం ఉంటుందన్నారు.

తాను మంత్రిగా ఉన్నంత వరకు ఎవరికీ హైదరాబాదులో ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. సినిమాకు కులం, మతం, ప్రాంతం అనే బేధం లేదని చెప్పారు. ఈ నెల 20వ తారీఖున సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమవుతామని చెప్పారు. త్వరలో ఉగాది పురస్కారాల పేరును మారుస్తామని చెప్పారు.
అంతకుముందు కూడా తలసాని, కేసీఆర్ వంటి వారు హైదరాబాదులోని సినీ పరిశ్రమకు, సీమాంధ్రులకు ధైర్యవచనాలు చెప్పారు. కేసీఆర్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రజల కాలికి ముల్లు గుచ్చుకుంటే తాను నోటీతో తీస్తానని చెప్పారు. ఇది కేసీఆర్ నోటి నుండి వచ్చే కామన్ డైలాగ్ అని చెప్పవచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలోను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాదులోని సీమాంధ్రులు భయపడాల్సిన పని లేదని తెరాస ప్రభుత్వం అభయమిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు త్వరలో ఎప్పుడైనా రానున్న గ్రేటర్ ఎన్నికలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా... తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలకు హైదరాబాదులో మంచి పట్టు ఉంది. అలాంటి వారి చేరిక ద్వారా, మాటలతో మచ్చిక చేసుకోవడం ద్వారా గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందాలని తెరాస భావిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications