పాత భవనం చుట్టూ కథలు: అది నిజాం ఖజానా?
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయంపై వేడిగానూ వాడిగానూ చర్చ సాగుతోంది. వాటిలో నిజాం కాలంనాటి భవనం చుట్టూ కొన్ని నమ్మకాలు పరుచుకుని ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది. ఆ పురాతన భవనం జి బ్లాక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
గత పదిహేనేళ్లుగా పురావస్తు శాఖ ఆ భవనంపై ఆసక్తి ప్రదర్సిస్తోంది. దాన్ని 1888లో నిర్మించారు. కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి సచివాలయంలోని ఈ భవనం వరకు సొరంగా మార్గం ఉందని భావిస్తున్నారు. నాణాలను ముద్రించే మింట్ కంపౌండ్కు సమీపంలో ఈ భవనం ఉంది. ఆ కాలంలో ఇది నగరానికి దూరంగా ఉన్నట్టు. శత్రువులు దాడి చేసినా ధనాగారం చిక్కకుండా ఉండేందుకు ఆరవ నిజాం కట్టించారు.
ఈ భవనాన్ని ఆరవ నిజాం కోశాగారంగా ఉపయోగించారు. ఏడవ నిజాం కూడా దీనిని కోశాగారంగా ఉపయోగించారు. నిజాం పాలన ముగిసి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తరువాత సచివాలయంగా మారింది. ఆ పాత భవనాన్ని దంగుసున్నం, విలువైన కలపతో ఈ భవనాన్ని నిర్మించారు. మెట్లకు టేకును ఉపయోగించారు. 1888లో ఈ భవనాన్ని నిర్మించినప్పుడు దానికి పెట్టిన పేరు సైఫాబాద్ ప్యాలెస్.ఇప్పుడు అది కూలిపోతూ పాత సామన్ల స్టోర్ రూమ్గా మారింది.
దానిపై ఎన్టీఆర్ ఆసక్తి
ఎన్టీ రామారావు 1983లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఈ భవనంలోనే ఉన్నారు. ఎన్టీఆర్ ఈ భవనానికి సర్వహిత అని పేరు పెట్టారు. 95లో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసేంత వరకు ఇందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండేది.
లక్ష్మీపార్వతి అప్పట్లో క్యారియర్ పట్టుకుని వచ్చేవారు
ఎన్టీఆర్ కార్యాలయంలో ఒక వెలుగు వెలిగిన భవనం ఇది. లక్ష్మీపార్వతి టిఫిన్ క్యారియర్తో వచ్చింది ఈ భవనంలోకే. కలప మెట్లతో అందంగా ఉన్న ఈ భవనం గత వైభవానికి చిహ్నంగా కనిపిస్తోంది. వందేళ్ల క్రితం ఉపయోగించిన కలప కూడా ఇప్పటికే ఉపయోగపడే విధంగా ఉంది. కలపను అమ్మినా భారీ మొత్తం వస్తుంది. గతంలో ఈ భవనంలోనే కింది వైపు మీడియా గది ఉండేది. ప్రస్తుతం అటువైపు కూలుతుండడంతో మూసివేశారు.
అక్కడి నుంచి సోరంగ మార్గం
కోటి ఉమెన్స్ కాలేజీ నుంచి ఈ భవనం వరకు సొరంగా మార్గం ఉందనే విషయం బయటపడడంతో పాటు ఈ భవనంలో నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దాంతో పురావస్తు శాఖ ఆసక్తి చూపించింది. ఈ భవనాన్ని త్వడానికి అనుమతి ఇవ్వాలని పురావస్తు శాఖ 2001లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను కోరింది. అయితే అందుకు అనుమతి లభించలేదు.
మరమ్మతుకు కోటి రూపాయల వ్యయం
తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో స్వల్పకాలం రాష్టప్రతి పాలన విధించినప్పుడు గవర్నర్కు కార్యదర్శులుగా వచ్చిన ఇద్దరిలో ఒకరు రాజస్థాన్కు చెందిన వారు ఉన్నారు. ఈ భవనం రాజస్థాన్లో నిర్మించిన భవనాల శైలిలో ఉందని ఆసక్తి ప్రదర్శించినట్లు చెబుతారు. కూలిపోతున్న దశలో ఉన్న భవనాన్ని తిరిగి ఉపయోగించుకునే విధంగా మార్చడానికి కోటి రూపాయల వ్యయం అవుతుందని నివేదిక ఇచ్చారు.