టీడీపీ-బీజేపీ కోల్డ్ వార్: ఏపీ వాణ్ణంటే తెలంగాణకేం చెప్పాలని వెంకయ్య
హైదరాబాద్: తాను కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మాట్లాడలేనని, ఏపీకే పరిమితం కాలేనని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. తాను ఏపీ తరఫున మాట్లాడితే.. కర్నాటక నుండి ఎన్నికైన తాను ఆ రాష్ట్రానికి ఏం సమాధానం చెబుతానని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణలోని తెలుగు వారికి ఏం జవాబు చెప్పాలన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించే తాను ఒక ప్రాంతానికి పరిమితం కాలేనని చెప్పారు.
అదే సమయంలో వెంకయ్య మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు లేవని చెబుతున్నారని, గుంటూరు, విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు గత ఏడాది రూ.10 కోట్లు చొప్పున కేటాయించారని గుర్తు చేశారు. అది ఖర్చు కాకపోవడంతో ఈ ఏడాది కేటాయింపులు పెంచలేదన్నారు. అవసరమైతే మళ్లీ ఇస్తారని చెప్పారు.
బడ్జెట్ పత్రంలోని వివిధ విభాగాల ప్రకారం కేటాయింపులు ఉంటాయన్నారు. అదనం అంతా సప్లిమెంటరీ బడ్జెట్లో ఉంటుందని చెప్పారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుందని చెప్పారు. అవగాహన లేకుండా విమర్శలు చేయవద్దని హితవు పలికారు. బడ్జెట్ తగ్గించారని చెప్పడం సరికాదని, కొన్ని పద్దులు రాష్ట్రానికి బదలాయించినప్పుడు ఆ మేరకు కేంద్రం వాటా తగ్గుతుందని చెప్పారు.
కలిసి పని చేసే పార్టీలు సంకీర్ణ ధర్మాన్ని పాటించాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించినవేనని చెప్పవచ్చు. ఇంటి విషయాలు ఇంట్లోనే పరిష్కరించుకోవాలని, వీధికెక్కడం సరికాదని టీడీపీని ఉద్దేశించి చెప్పారు. తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏపీ రాజధానికి పట్టణాభివృద్ధి శాఖ నండి రూ.1000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు. ఏపీ విషయంలో తాము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు. 30 ఏల్లలో పూర్తి కానీ పోలవరం ప్రాజెక్టు ఆరు నెలల్లో పూర్తి చేయగలమా అని ప్రశ్నించారు. విభజన హామీల పైన కేంద్రం ఎక్కడా మాట తప్పలేదని, అయితే కొంత వేగం తగ్గిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే సంతోషించే వాళ్లలో తొలి వ్యక్తిని తానే అన్నారు. కాగా, టీడీపీ, బీజేపీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే.