జగన్ ఛేంబర్లోకి నీళ్లు: కుట్ర కోణంలోని వ్యూహం ఇదీ...
అసెంబ్లీ భవనంలోని జగన్ ఛేంబర్లోకి వర్షం నీరు చేరడంలో కుట్ర కోణం దాగి ఉందని ప్రభుత్వం అంటోంది. అయితే, ఈ వాదనలో పలు లోపాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమస్యలు విచిత్రమైన మలుపు తీసుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య సమస్యలు అటకెక్కిన అసలు విషయాలు మరుగున పడిపోతున్నాయి. తాజాగా, వెలగపూడిలో కొత్త నిర్మించిన అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఛేంబర్లోకి వర్షం నీరు చేరడం కూడా రాజకీయ వివాదంగా మారింది.
దాదాపు 2నిమిషాల పాటు కురిసిన వర్షం వల్ల దాదాపు 1000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం తడిసి ముద్దయ్యాయి, నిర్మాణ-నిర్వహణ వైఫల్యాలపై చర్చ జరుగుతున్న సమయంలోనే, అసెంబ్లీలోని జగన్ చాంబరులోకి మాత్రమే వర్షం నీరు ప్రవేశించడం ఎలా సాధ్యమనే కొత్త కోణం ముందుకు వచ్చి సమస్య పక్కదారి పట్టింది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని స్పీకర్ కోడెల శివప్రసాద రావు సీబీసీఐడిని ఆదేశించడంతో మొత్తం అసెంబ్లీ లోపల భవనాలు, జగన్ చాంబరు పైనుంచి లీకేజీ, ఇతరుల ప్రవేశం వంటి అంశాలు ముందుకు వచ్చాయి. పైప్లైన్ కావాలనే కత్తిరించారని విచారణలో తేలిందని, కావాలని కత్తిరిస్తే తప్ప పైపు కట్టయ్యే అవకాశం లేదని, సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావుకొత్త విషయాన్ని వెల్లడించారు.
స్పీకర్ చెప్పిన తర్వాత...
సంఘటనా స్థలాన్ని సందర్సించిన తర్వాత కోడెల శివప్రసాద రావు జగన్ ఛేంబర్లోకి నీరు ఎందుకు చేరిందో తేల్చేశారు. పైప్లైన్ కావాలనే కత్తిరించారని ఆయన స్పష్టం చేశారు. అందుకే దీనిపై సీబీసీఐడి విచారణకు ఆదేశించామని, నాలుగురోజుల్లో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని చెప్పారు. అయితే స్వయంగా స్పీకరే ఇందులో కుట్ర ఉందని చెప్పినందున సీఐడి నివేదిక ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదని అంటున్నారు.
కుట్ర కోణమే ముఖ్యమైంది...
జగన్ ఛేంబర్లోకి నీరు చేరిన వ్యవహారాన్ని కుట్ర కోణంలోనే ప్రభుత్వం కుట్ర కోణంలోనే చూస్తోందనేది అర్థమైంది. సభ జరగని రోజుల్లో అనుమతి లేనిదే ఇతరులను లోనికి అనుమతించరు. కేవలం ఎమ్మెల్యేలు, అసెంబ్లీ అధికారులు, సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. మరి ఆ ప్రకారంగా బయట వ్యక్తులు కుట్ర చేసే అవకాశం ఉండదు. పైగా అసెంబ్లీ లాబీ చుట్టూ, మొదటి అంతస్తు పైకి ఎక్కే మెట్ల వద్ద సిసి టివి కెమెరాలు ఉన్నాయి. అయితే అవి శాసనసభ జరిగే సమయాల్లోనే పనిచేస్తాయా? లేవా? అనేది చెప్పాల్సి ఉంది.
కావాలనే కట్ చేశారని చెప్పిన తర్వాత..
అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు, కేబుల్స్ వెళ్లేందుకు గోడల్లోంచి పీవీసీ పైపులు ఏర్పాటుచేశారని, అయితే జగన్ పీఏ రూమ్ పైన పీవీసీ పైపును ఎవరో కావాలనే కట్ చేశారని, మొదటి అంతస్తులో వర్షం నీళ్లు బయటకు వెళ్లే పైప్లైనుకి కొద్ది దూరంలోనే కేబుల్స్ వెళ్లే పీవీసీ పైప్ ఉందని, భారీ వర్షానికి శ్లాబ్పై నీళ్లు చేరడంతో కట్ చేసిన పైప్ నుంచి వర్షం నీళ్లు లీకయ్యాయని అధికారులు కూడా చెబుతున్నారు జగన్ చాంబరు పైన ఎవరో కావాలనే మూత తీశారని, మొదటి అంతస్తులోకి నీళ్లు రాకుండా కేవలం జగన్ చాంబరు లోకే నేరుగా వచ్చాయని, అందువల్ల ఇందులో కుట్ర కోణం ఉందని చెబుతున్నారు. తాజాగా మంత్రి నారాయణ కూడా అదే మాట అన్నారు. అదే విషయం సిఐడి అధికారులు కూడా చెబుతున్నారు. అలా నిర్ధారించిన తర్వాతనే కోడెల శివప్రసాద రావు సిబిసిఐడి విచారణకు ఆదేశించారు.
జగన్ పార్టీ వాదన ఇలా...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుల వాదన అందుకు భిన్నంగా ఉంది. మిగిలిన చాంబర్లకు నీళ్లు లీకవకుండా కేవలం జగన్ చాంబరులోకే ఎలా లీకయ్యాయన్నది వారి ప్రశ్న. కుట్ర కోణం ఉందని చెప్పడం ద్వారా నిర్మాణ, నిర్వహణ వైఫల్యాన్ని పక్కదారి పట్టించి, భవన నిర్మాణ కంపెనీలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తమపైనే నిందులు మోపి వైఫల్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజానికి వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జగన్ ఛేంబర్లోకి వైసిపి ఎమ్మెల్యేలకు లేదా వారి సిబ్బందికి వెళ్లే అవకాశం ఉంటుంది. కావాలని వారే పైప్లైన్ కత్తిరించి, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారనే నిర్ణయానికి దాదాపుగా ప్రభుత్వం వచ్చినట్లే కనిపిస్తోంది.
వైసిపి మీదికే తిప్పిన ప్రభుత్వం
వైయస్ జగన్ ఛేంబర్ తమ నాయకుడి చాంబరుపైన ఉన్న పైపును తామెందుకు కట్ చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రశ్నించారు. అంత చిన్న పైప్ నుంచి అంత పెద్ద నీటిధార ఎలా వస్తుందని కూడా అడుగుతున్నారు. ప్రభుత్వ ఉత్సాహం చూస్తుంటే ఇదేదో తామే చేయించినట్లు చూపించే కుట్రలా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సీసీ టీవీ పుటేజీలను వెంటనే స్వాధీనం చేసుకుని, వాటిని అన్ని పార్టీలకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మీడియాను అనుమతించకపోవడంతోనే...
పైప్ లైన్ లీకేజీ వ్యవహారాన్ని పరిశీలించడానికి మీడియాను అనుమతించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికీ అసెంబ్లీ లోపల ఉన్న చాంబర్ల పరిస్థితి ఏమిటన్నది బయటకు రావడం లేదని అంటున్నారు అసెంబ్లీ నిర్వహణ, నిర్వహణ, దాన్ని పర్యవేక్షించే అధికారం స్పీకర్ పరిధిలో ఉన్నప్పటికీ నిర్మాణంలోని లోపాలను కప్పి పుచ్చే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. వర్షం కురిసిన రోజు జగన్ చాంబరులోకి నీళ్లొస్తున్నాయని వార్తలు వెలువడటంతో అక్కడికి వెళ్లిన మీడియాను అనుమతించి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు.
ఇలా చేశారు..
బుధవారం వైసీపీ ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లినప్పుడూ మీడియాను అడ్డుకోవడం అనుమానాలు, విమర్శలకు అవకాశం ఇచ్చింది. మీడియాకు అనుమతి లేదని చెప్పిన అదే అధికారులు, స్పీకర్ సంఘటన స్థలం పరిశీలనకు మాత్రం అనుమతించారు.. హైదరాబాద్లో అసెంబ్లీ జరగని సమయంలో కూడా మీడియాకు ప్రవేశం ఉంది. ఇప్పుడూ అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పద్ధతులు, సంప్రదాయాలు, నిబంధనలేమిటో అర్థం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సరి చేస్తే ఎలా కనబడింది?
స్పీకర్, సీఐడి అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా అసెంబ్లీ నిర్వహణ చూస్తున్న సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చేసిన ప్రకటన ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సంఘటన స్థలం వద్దకు వెళ్లిన స్పీకర్, సీఐడి అధికారులు ఎవరో కావాలనే పైపులైను కత్తిరించినట్లు కనిపిస్తోందని మీడియాకు చెప్పారు. కానీ సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం రాత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
ఆయనేం చెప్పారు...
అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత గదికి సంబంధించి ఎలక్ట్రికల్ కాండ్యూట్ పైప్ ద్వారా నీరు వచ్చిందని, దాన్ని ఇంజనీరింగ్ అధికారులు వెంటనే సరిచేశారని శ్రీధర్ చెప్పారు. వాస్తవానికి అధికారులు సరిచేస్తే బుధవారం నాడు ఆ లోపం కనిపించకూడదు. అంటే దీన్ని బట్టి సీఆర్డీఏ అధికారుల పరిశీలన సక్రమంగా లేదని భావించాలా, మంగళవారం రాత్రి పరిస్థితిని కమిషనర్ అవగాహన చేసుకోలేకపోయి ఉండాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి పరిశీలనకు వెళ్లామంటున్న అధికారులు, బుధవారం స్పీకర్-పోలీసులు గుర్తించే వరకూ అక్కడ పైప్లైను కట్ చేశారని గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.