బాలకృష్ణ అసంతృప్తి: ఎన్టీఆర్కు కాలం చెల్లిందా?
హైదరాబాద్: ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఎన్టీ రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ను పట్టించుకోవాలని ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కోరారు.
అటు బాలకృష్ణ అసంతృప్తిని, ఇటు లక్ష్మీపార్వతి విజ్ఞప్తిని పరిశీలిస్తే హైదరాబాదులో తెలంగాణ ఏర్పాటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాల సందర్భంగా సందడి ఉండేది. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర్ ర్యాలీ నిర్వహించేవారు.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు తెలంగాణలో తన స్థానాన్ని క్రమంగా కోల్పోతారా అనే అనుమానం ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే అర్థమవుతోంది. పి. ఇంద్రారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వంటి పలువురు కొత్త తరం నాయకులు ఎన్టీ రామారావు కారణంగా రాజకీయాల్లోకి వచ్చి సీనియర్ నాయకులుగా ఎదిగారు. తెలంగాణలో ఎన్టీ రామారావుకు తిరుగులేని స్థానం ఉంటూ వచ్చింది.

ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీ రామారావు అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మకాం విజయవాడకు మార్చుకున్నారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహాలకు, ఎన్టీఆర్ ఘాట్కు క్రమంగా తెలంగాణ కాలం చెల్లిపోయే ప్రమాదం ఏర్పడింది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్టీఆర్ వారసత్వం, ఎన్టీఆర్ ఆశయాలు క్రమంగా పక్కకు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని ప్రజల మధ్యకు వెళ్లే పరిస్థితి లేదు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కల్పించారని టిడిపి నాయకులు చెబుతున్నా అది కాలం చెల్లిపోయిన వాదంగా కనిపిస్తోంది.
తెలంగాణలో ఎన్టీఆర్ పక్కకు జరిగిపోయి, తెలంగాణ ఉద్యమం విషయంలోనూ రాష్ట్ర విభజనలోనూ చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి పెద్ద నీడలా తెలంగాణ ప్రజల ముందు నించుంది. చంద్రబాబు నీడ ముందు తెలంగాణ ప్రజలకు ఎన్టీఆర్ కనిపించకుండా పోయారు.
తెలంగాణ ప్రజలు కొత్త వారసులను, కొత్త ప్రతీకలను, తమవైనవాటిని దేవులాడుకుని ముందుకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఎన్టీ రామారావు పేరు కూడా క్రమంగా తెలంగాణలో వినిపించుకుండా పోతుందా అనే అనుమానం కలుగుతోంది.












Click it and Unblock the Notifications