తెలంగాణలో దుస్థితి: జగన్కు దొరకని అభ్యర్థులు
హైదరాబాద్: తెలంగాణలో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సత్తా చాటుతారనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులతో తెలంగాణలో జగన్ హవా ప్రదర్శిస్తారనే అభిప్రాయం ఉండేది. పలువురు కాంగ్రెసు శాసనసభ్యులు అప్పట్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి దూకడానికి కూడా సిద్ధపడ్డారు. జగన్ సమైక్యాంధ్ర నినాదం తీసుకోగానే ఒక్కసారిగా అందరూ వెనక్కి తగ్గారు. పార్టీలో ఉన్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఎవరికి పుట్టిన బిడ్డరా అంటే వెక్కి వెక్కి ఏడ్చినట్లుంది.
తెలంగాణలో పోటీ చేయడానికి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అభ్యర్థులు లభించడం లేదు. బుధవారంనాడు తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది, తెలంగాణలో పార్టీని ఎవరు నడిపిస్తారనేది తేలడం లేదు. సిపిఎంతో కలిసి వెళ్లడం ద్వారా నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరుకుతారని వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం భావించింది.
అయితే, సిపిఎంతో పొత్తు పెట్టుకోవడం వల్ల జాతీయ స్థాయిలో భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను గ్రహించి వైయస్ జగన్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఏదో మేరకు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు ఈ నెల 5 లేదా ఆరు తేదీల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణలో నియోజకవర్గం ఇంచార్జీలుగా నియమితులైన 60 శాతం మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓ నమస్కార బాణం పారేసి వెళ్లిపోయారు. మిగిలనవారు కూడా స్థిరంగా ఉండేట్లు కనిపించడం లేదు. హైదరాబాదులోనే సగానికిపైగా సీట్లకు అభ్యర్థులు దొరకడం లేదని సమాచారం. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్లో అప్పారావు, సంగారెడ్డిలో జి. శ్రీధర్ రెడ్డి తప్ప మరెవరూ లేరు.
నల్లగొండ జిల్లాలో హుజూర్నగర్లో గట్టు శ్రీకాంత్ రెడ్డి, కోదాడలో వై వెంకటరత్నం మాత్రమే చురుగ్గా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 70 శాతం మందికి పైగా నేతలు పార్టీని వదిలేశారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సమన్వయకర్తలు కూడా పోటీకి సిద్ధంగా లేరు. మహబూబ్నగర్ జిల్లాలో ఐదారుగురు అభ్యర్థులు పోటీకి దొరికే అవకాశం ఉంది. తెలంగాణవాదం బలంగా లేదని భావిస్తున్న జిల్లాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అభ్యర్థులు లభించడం లేదు. ఏమైనా, వైయస్ జగన్ స్వయంగా తెలంగాణను ఖాళీ చేయడానికి సిద్ధపడ్డారనే మాట వినిపిస్తోంది.