చంద్రబాబు 'నమస్కారం': మోడీతో భేటీకీ జగన్ రెడీ
అమరావతి: పొత్తు వద్దంటే బిజెపికి ఓ నమస్తారం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు.
Recommended Video

తెలుగుదేశం, బిజెపిలకు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో జగన్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తన ప్రజా సంకల్ప పాద యాత్ర మధ్యలోనే ఆయన మోడీని కలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో...
లోకసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో జాప్యం చేయకుండా పాదయాత్ర మధ్యలోనే జగన్ మోడీని కలుసుకుంటారని చెబుతున్నారు. మోడీ అపాయింట్మెంట్ తీసుకునే బాధ్యతను ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఓ పార్లమెంటు సభ్యుడికి అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విజ్ఞప్తి చేశారు...
ఏప్రిల్లో ప్రధాని మోడీని జగన్ లిసేందుకు అవకాశం ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం పిఎంవోను కోరినట్లు తెలుస్తోంది. అంటే జగన్ పాదయాత్ర మధ్యలోనే అవుతుంది. జగన్ మోడీని కలవడం ఖాయమని పార్టీ ఎంపిల్లో ఒకరు అంటున్నారు. అయితే, పాదయాత్ర ముగిసిన తర్వాత మోడీని జగన్ కలిస్తే బాగుంటుందని కొంత మంది అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై ఆధారాలు సేకరించి...
ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పాదయాత్ర మధ్యలోనే కలిస్తే బాగుంటుందని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈలోగా చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై తగిన సాక్ష్యాధారాలు సేకరించి వాటిని మోడీకి అందజేయాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

టిడిపి, బిజెపి మధ్య విభేదాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. టిడిపి సంయమనం పాటించినప్పటికీ విష్ణుకుమార్ రాజు, పురంధేశ్వరివంటి బిజెపి నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాంతో సహనం కోల్పోయిన చంద్రబాబు తెగదెంపులు చేసుకుంటామని బిజెపి భావిస్తే తాము ఓ నమస్కారం పెడుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రధానిని కలవాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications