ప్రముఖ చిత్రకారుడు కరుణాకర్ కన్నుమూత
హైదరాబాద్: నంది అవార్డు గ్రహీత, ప్రముఖ చిత్రకారుడు ఎన్.కరుణాకర్ (60) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. బాపూ, బాలి తరువాత ఆ పరంపరలో కరుణాకర్ విశేష కృషి చేశారు. విశాఖపట్నంలో సూర్యప్రకాశ్, కస్తూరి దంపతులకు జన్మించిన కరుణాకర్ అమీర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, అనంతరం ఏపి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నారు.
ప్రముఖ పత్రికలలో చిత్రకారుడిగా పనిచేశారు. కరుణాకర్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. సోమాజిగూడలోని క్రాంతిశిఖర అపార్ట్మెంట్లో ఆధునిక గ్రాఫిక్స్ను ఆయన నడుపుతున్నారు. గురువారం సాయంత్రం గుండెనొప్పి రావడంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సనత్నగర్లోని ఆయన స్వగృహానికి తరలించారు.
ఆయన భౌతికకాయానికి శుక్రవారం సనత్నగర్ ఇఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వంచనున్నారు. కరుణాకర్ మృతికి కార్టూనిస్టులు జిఎస్ఆర్, కలిమిశ్రీ, జలదంకి ప్రభాకర్, శరత్బాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రసిద్ధ చిత్రకారుడు ,మిత్రశ్రీ కరుణాకర్ అస్తమయం మిత్రులకీ పత్రికారంగానికి తీరనిలోటు బ్నిం అన్నారు. చిత్రకారులు, కార్టూనిస్టులు కరుణాకర్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరుణాకర్తో తమకు గల సాన్నిహిత్యాన్ని నెమరేసుకున్నారు.