తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్!
రాష్ట్రంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. తెలంగాణలో గ్యాస్, పెట్రోల్ ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలపై ఈ మేరకు స్టీఫెన్ రవీంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బుధవారం ఒక్కరోజే 2,123 ట్యాంకర్స్ పెట్రోల్ సరఫరా చేశాయని.. సోషల్ మీడియాలో వదంతులు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఒక్క రోజే 10,799 కిలో లీటర్ల సరఫరా జరిగిందని.. సగటుగా 5,883 కిలో లీటర్ల పెట్రోల్ వినియోగం ఉంటే.. బుధవారం ఒక్కరోజే 84 శాతం అధికంగా పెట్రోల్ సరఫరా చేశారని చెప్పారు. 22,127 కిలో లీటర్ల డీజిల్ ఆయిల్ కంపెనీలు సరఫరా చేశాయని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్, డీజిల్ 596 అవుట్ లెట్స్ ఉన్నాయని.. ప్రతి బంకులోనూ పౌరసరఫరా, సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం పరిశీలన చేస్తుందని పేర్కొన్నారు. బుధవారం కంటే గురువారం రోజున పెట్రోల్ బంకులు వద్ద రద్దీ తగ్గిందని స్పష్టం చేశారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా గురించి కూడా స్టీఫెన్ రవీంద్ర వివరాలను వెల్లడించారు. తెలంగాణలో గృహ వినియోగంలో 1,28, 24,087 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని.. ప్రతీ రోజు 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు.

బుధవారం ఒక్కరోజే 2,19,98 సిలిండర్లు సరఫరా చేశామని.. వినియోగదారులు అధికంగా బుకింగ్స్ చేయడం వల్లే కాస్త ఇబ్బంది కలుగుతోందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అలాగే 1,03,275 పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయని.. 2,78,418 క్యూబిక్ మీటర్లు సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు పీఎన్డీ, సీఎన్జీని విస్తరించాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications