భూమాకు గుండెపోటు, నెహ్రూకు వెన్నుపోటు: బాబుపై రోజా సెటైర్లు
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశంలో చేరిన నేతల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు.
భూమాకు గుండెపోటు
టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి అనతి కాలానికే గుండెపోటుకు గురి కాగా, జ్యోతుల నెహ్రూ వెన్నుపోటుకు గురయ్యారన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని నడకుదురు గ్రామంలో గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ప్లీనరీకి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
నెహ్రూకు వెన్నుపోటు
మంత్రి పదవి ఆశ చూపి జ్యోతుల నెహ్రూను తెలుగుదేశం పార్టీలోకి లాగారన్నారు. చంద్రబాబు విసిరిన బిస్కెట్లకు ఆశ పడి పార్టీ మారిన నెహ్రూ చివరకు వెన్నుపోటుకు గురయ్యారని రోజా ఆరోపించారు. నెహ్రూ పరిస్థితి నేడు రెంటికి చెడ్డ రేవడి చందాన మారిందని వ్యాఖ్యానించారు. ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా దొరకడంలేదని, వైసీపీలో ఉంటే మంచి గౌరవం ఉండేదన్నారు.
వైసీపీదే నంద్యాల సీటు
భూమా నాగిరెడ్డి కూడా మంత్రి పదవి కోసం నిరీక్షించి, చివరకు గుండెపోటుకు గురయ్యారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని, అది వైసీపీ సీటేనని, అక్కడ తమకు కేడర్ బలంగా ఉందని రోజా ధీమా వ్యక్తంచేశారు.
Recommended Video
లోకేష్ పప్పు.. చినరాజప్ప, యనమల అసమర్థులు
మంత్రి లోకేష్ ముద్దపప్పు అని, జయంతికి, వర్ధంతికి మధ్య తేడా తెలియని ఆయన రాజకీయాల్లో ఎలా రాణించగలరని ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రులిద్దరూ అసమర్ధులని చినరాజప్ప, యనమల రామకృష్ణుడును ఉద్దేశించి రోజా విమర్శించారు.