అమెరికాలో హత్యలపై సభలో ఆందోళన: విద్వేషం కాదు.. కత్తితో పొడిచారని అమెరికా పోలిస్
అమెరికాలోని న్యూజెర్సీలో ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంత రావు భార్య శశికళ, తనయుడు హనీష్ సాయి మృతి అంశాన్ని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు.
న్యూఢిల్లీ: అమెరికాలోని న్యూజెర్సీలో ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా హనుమంత రావు భార్య శశికళ, తనయుడు హనీష్ సాయి మృతి అంశాన్ని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో లేవనెత్తారు.
శశికళ, హనీష్ మృతిలపై ఆయన స్పందిస్తూ.. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అన్నారు. ప్రమాదకరం అన్నారు. రెండు వారాల క్రితమే ఇద్దరు ఇండియన్స్ హత్య గావించబడ్డారని, ఇప్పుడు మరో ఇద్దరు చనిపోయారన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాతో మాట్లాడాలని టి సుబ్బి రామిరెడ్డి సూచించారు.
లోకసభలో వైసిపి ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా అడిగారు. అమెరికాలో జరుగుతున్న హత్యలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే అమెరికాలో జాత్యాహంకార హత్యలు జరిగాయని, ఇవి కూడా అలాగే అయితే సీరియస్గా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని అమెరికా దృష్టికి గట్టిగా తీసుకు వెళ్లాలన్నారు.
జాతి విద్వేషం కారణం కాదు
మరోవైపు, ఇవి జాతి విద్వేష హత్యలు కాదని అమెరికా పోలీసులు తెలిపారు. భారతీయులపై విద్వేషంతోనే హత్య జరిగివుంటుందని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. శశికళ మృతికి సంబంధించి నిందితుడు పలుమార్లు కత్తితో దాడి చేసినట్లు గుర్తించామని బర్లింగ్టన్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.
ఇదిలా ఉండగా, శశికళ, హనీష్ సాయిల మృతిపై ఆమె తల్లిదండ్రులు స్పందించిన విషయం తెలిసిందే.
తమ కుమార్తె, మనవడిని అల్లుడే హత్య చేసి కట్టుకథలు అల్లుతున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. విజయవాడ నగర శివారులోని తాడిగడప లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న శశికళ తల్లిదండ్రులు.. హత్య సమాచారం తెలిసిన వెంటనే కుప్పకూలిపోయారు. అల్లుడే ఈ హత్య చేశారన్నారు.
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని, తనను సరిగా చూడడం లేదంటూ తమ కుమార్తె పలుమార్లు తమ వద్ద విలపించిందన్నారు.
కాగా, న్యూజెర్సీలోని మ్యాపుల్సెట్లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన హనుమంతరావు భార్య నర్రా శశికళ, అతని ఏడేళ్ల కుమారుడు హనీష్ సాయి హత్యకు గురైన సంగతి తెలిసిందే.