రబీకి పగలే 9గంటల విద్యుత్తు: ఎన్పీడీసీఎల్ కసరత్తు
వరంగల్: ఖరీఫ్ వరి పంట చివరి దశకు చేరడంతో వరంగల్ విద్యుత్తు సర్కిల్లో వినియోగం క్రమంగా పెరుగుతోంది. సెప్టెంబరు చివర్లో సుమారు పది రోజులపాటు భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు వినియోగం సాధారణంగా నమోదయింది. వర్షాల ప్రభావం అక్టోబరు మూడో వారం వరకు సాగింది. నేల తేమగా ఉండటం, పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో రైతులు పెద్దగా కరెంటు వాడలేదు.
ఖరీఫ్ సీజను ఆరంభంలో వర్షాలు లేక ఆలస్యంగా వేసిన పంట ఇప్పుడు కోతకోస్తోంది. దీంతో గత పది రోజులుగా విద్యుత్తు వినియోగం బాగా పెరగడంతో వరంగల్ సర్కిల్కు కేటాయించిన విద్యుత్ కోటా 7.43 మిలియన్ల యూనిట్లు మించి 10.94 మిలియన్ యూనిట్ల వరకు నమోదవుతుంది. ఏటా సెప్టెంబరు నుంచి నవంబరు వరకు పంటలు కోతకొచ్చే సమయంలో నీటి వినియోగం అధికంగా ఉంటుంది.
ఇదే సమయంలో వ్యవసాయ విద్యుత్తు వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విద్యుత్తు వినియోగం సాధారణంగా ఉండగా.. గత పదిరోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో జిల్లా కోటాను మించి నమోదయింది. వ్యవసాయ వినియోగానికి సుమారు నాలుగు మిలియన్ యూనిట్లకుపైగా వినియోగిస్తుండగా దేవాదుల ఎత్తిపోతలకు 2.5 మిలియన్ యూనిట్లు వాడుతున్నారు. మిగిలిన యూనిట్లు గృహ, గృహేతర, పారిశ్రామిక అవసరాలకు వినియోగమవుతోంది.
రైతులకు కష్టం లేకుండా..
రైతులకు పగటిపూటే తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరాను చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా విద్యుత్తు లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బలోపేతం చేయమని పంపిణీ సంస్థలకు మార్గదర్శకాలు జారీచేసింది. దీనికనుగుణంగా పంపిణీ సంస్థలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. గత ఏడాది రబీ సీజన్లో ఏప్రిల్ నుంచి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరాను అందించారు.
కానీ, ఒకేసారి తొమ్మిది గంటలు విద్యుత్తు ఇవ్వడంతో బోరు బావుల్లో నీరు లేక మోటార్లు కాలిపోతున్నాయని రైతులు పలుమార్లు విజ్ఞప్తులు చేయడంతో అన్నదాతలను రెండు గ్రూపులుగా విభజించి సరఫరాను అందిస్తున్నారు. వరంగల్ విద్యుత్తు సర్కిల్ పరిధిలోని అయిదు జిల్లాలో 12,94,052 సర్వీసులు ఉండగా ఇందులో 2,89,976 వ్యవసాయ సర్వీసులు. వీటిని ఫీడర్ల వారీగా ఏ, బీ గ్రూపులుగా విభజించి రెండు విడతల్లో తొమ్మిదిగంటలపాటు అందచేయనున్నారు.
'ఏ' గ్రూపునకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు, 'బీ' గ్రూపునకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి దఫాలో ఆరుగంటల విద్యుత్ను సరఫరా చేస్తున్నారు. మిగిలిన మూడు గంటల సరఫరాను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు తొలి రెండు గ్రూపులలోని సర్వీసులను ఫీడర్లు వారిగా విభజించి ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. అప్పట్లో ప్రజాప్రతినిధులు సైతం రెండు విడతల ఇవ్వాలని కోరారు.
ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతోపాటు 'మిషన్ కాకతీయ' పనులతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇదే స్థాయలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండటంతో రబీ సీజన్లో పగటిపుటే తొమ్మిది గంటల పాటు సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.