YS Jagan: జగన్ కోడి కత్తి కేసు తేల్చేయబోతున్న హైకోర్టు..! ముహుర్తం ఖరారు..!
2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)పై జరిగిన కోడి కత్తి దాడి కేసు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాసరావు ఇప్పటికే ఆరేళ్లకు పైగా శిక్ష కూడా అనుభవించాడు. ఈ కేసులో కుట్ర కోణం లేదని గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీర్పు కూడా ఇచ్చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా పెండింగ్ పడుతూ వస్తున్న ఈ కేసు విచారణ కొలిక్కి వస్తోంది.
విశాఖ ఎయిర్ పోర్టులో తనపై కోడి కత్తి దాడి జరిగితే అక్కడి ఎన్ఐఏ కేసుల కోర్టు (మూడో అదనపు జిల్లా కోర్టు )లో మాత్రమే విచారణ జరపాలని, కానీ విజయవాడలో ఎన్ఐఏ కోర్టు తీర్పు ఎలా ఇస్తుందని, అయినా ఇందులో కుట్ర కోణాన్ని ఎన్ఐఏ పూర్తిగా వెలికి తీసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మే 6కు తీర్పును వాయిదా వేసింది.

2023 జూలైలో కేంద్రం ఎన్ఐఏ కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందని, దాని ప్రకారం విశాఖ కోర్టులోనే తన కేసు విచారణ జరగాలని జగన్ కోరుతున్నారు. దీనికి విరుద్దంగా విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఎలా విచారణ జరిపి తీర్పు ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం విశాఖలో కోర్టు ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చిందని, కోర్టు ఏర్పాటు కాలేదని, కాబట్టి విజయవాడ ఎన్ఏఐ కోర్టులో విచారణ జరిపి తీర్పు ఇచ్చే అధికారం ఉందని వాదిస్తోంది. విశాఖ ఎన్ఐఏ కోర్టులో న్యాయమూర్తుల నియామకం పూర్తి కానందున విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పునే పరిగణనలోకి తసుకోవాలని కోరుతోంది. దీంతో మే 6న హైకోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications