భారత్ లో ఇజ్రాయెల్ సీక్రెట్ ఆపరేషన్..! 250 మంది మణిపూర్ కుకీల ఎయిర్ లిఫ్ట్..!
ఓవైపు ఇరాన్, లెబనాన్ పై దాడులు చేస్తూ, వారి నుంచి ప్రతిదాడులు ఎదుర్కొంటూ యుద్దంలో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ అదే సమయంలో భారత్ లో అనూహ్య చర్యకు దిగింది. భారత్ లోని మణిపూర్ లో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. వింగ్స్ ఆఫ్ డాన్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 250 మంది భారతీయ పౌరుల్ని విమానంలో ఎత్తుకెళ్లిపోయింది. దీంతో ఈ వ్యవహారం భారత్ తో పాటు వివిధ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈశాన్య భారతంలో ఇజ్రాయెల్ తెగలు (Israel)
ఈశాన్య రాష్ట్రాల్లో ఇజ్రాయెల్ తో చారిత్రక సంబంధాలు ఉన్న బేణి మెనాషే తెగకు చెందిన దాదాపు 5 వేల మంది ఎప్పటి నుంచో నివసిస్తున్నారు. వీరికి భారత పౌరసత్వం కూడా ఉంది. అయితే వారికి తమ పూర్వీకులు నివసిస్తున్న ఇజ్రాయెల్ కు వెళ్లాలనే ఆరాటం కూడా ఉంది. దీంతో వీరిని భారత్ నుంచి తమ స్వదేశానికి తీసుకెళ్లేందుకు వీలుగా ఇజ్రాయెల్ ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ చేపట్టింది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నిన్న తొలి విడతలో ఇజ్రాయెల్ 250 మందిని మణిపూర్ నుంచి ఢిల్లీ మీదుగా ప్రత్యేక విమానంలో ఎయిర్ లిప్ట్ చేశారు. గతేడాది నెతన్యాహు ప్రభుత్వం భారత్ నుంచి ఈ వర్గానికి చెందిన సుమారు 4,600 మంది సభ్యుల వలసలకు నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. గత రెండు దశాబ్దాలలో, దాదాపు 5,000 మంది ఇప్పటికే ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. సంవత్సరానికి 1,200 మంది చొప్పున, మొత్తం సమాజం వలస వెళ్ళడానికి వీలు కల్పించే ఒక ఆపరేషన్కు ఇది ఆరంభంమని ఇజ్రాయెల్ వలసల శాఖ మంత్రి ఒఫిర్ సోఫర్ ఏఎఫ్పీకి తెలిపారు.

బేణి మెనాషే ఎవరు?
బైబిల్ ప్రకారం ప్రాచీన ఇజ్రాయెల్ ప్రజలు 12 తెగలుగా విభజించబడ్డారు. వాటిలో పది తెగలకు యాకోబు కుమారుల పేర్లు పెట్టగా, మిగిలిన రెండు తెగలకు అతని మనవళ్ళైన ఎఫ్రాయిమ్ మరియు మెనాషే (లేదా మనస్సే) పేర్లు పెట్టారు. వీరు యోసేపు కుమారులు. బేణి మెనాషే సమాజం తాము మెనాషే వంశస్థులమని చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ రాజ్యం ఓడిపోయిన తర్వాత, క్రీ.పూ. 722లో అస్సిరియన్ విజేతలు వారిని దేశ బహిష్కరణకు గురిచేశారు. పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, చైనాల గుండా శతాబ్దాల పాటు సాగిన వలసల తర్వాత, ఈ సమాజానికి చెందిన సుమారు 10వేల మంది భారతదేశ ఈశాన్య ప్రాంతానికి చేరుకుని మణిపూర్, మిజోరంలో స్థిరపడ్డారు.
మణిపూర్ లో కుకీలపై మతహింసతో..
చారిత్రాత్మకంగా యూదులు భారత్ ను ఒక సురక్షితమైన ప్రదేశంగా భావించారు. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎదుర్కొన్నట్లుగా వారు ఈ దేశంలో ఎప్పుడూ మతపరమైన హింసను ఎదుర్కోలేదు. మణిపూర్లో బేణి మెనాషే సమాజాన్ని కుకీలుగా వర్గీకరించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ మిషనరీల ప్రభావంతో చాలా మంది కుకీలు క్రైస్తవ మతంలోకి మారారు. అయినప్పటికీ, బేణి మెనాషే సమాజం యూదు మతాన్ని, దాని ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తుంది.నిజానికి వీరు ఇజ్రాయెల్కు తరలి వెళ్లాలని కోరుకోవడానికి గల ముఖ్య కారణాలలో మతం కూడా ఒకటి. మణిపూర్ నివాసి అయిన బెంజమిన్ హావోకిప్.. మారుమూల కొండ ప్రాంతాలలో మతపరమైన మౌలిక సదుపాయాలకు కనెక్టివిటీ లేకపోవడం ప్రదాన అడ్డంకి అని చెప్తున్నారు.

ఇజ్రాయెల్ కు వీళ్ల అవసరం ఏంటి ?
గాజాలో హమాస్తో, ఆ తర్వాత ఇరాన్తో సుదీర్ఘ యుద్ధంలో నిమగ్నమైన ఇజ్రాయెల్, కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. 2023లో హమాస్ జరిపిన దాడితో ప్రారంభమైన సంఘర్షణల కారణంగా దాని కార్మిక శక్తిలో అధిక భాగం తగ్గిపోయింది. యుద్ధం కారణంగా నేపాల్, థాయ్లాండ్ వంటి దేశాల నుండి వలస కార్మికుల సంఖ్య తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది. బేణీ మెనాషే వర్గాన్ని వేరే చోటికి తరలించడం వారి కార్మిక శక్తిని తిరిగి సమకూర్చుకోవడానికి సాయపడుతుంది. గలీలీ వంటి సరిహద్దు ప్రాంతాలలో ఈ వర్గాన్ని స్థిరపరచాలన్న ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యను, అరబ్-ఇజ్రాయెల్ జనాభాను సమతుల్యం చేసే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications