ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..!
ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి దాడి ప్రారంభించి నెల రోజులు దాటిపోయినా దారీ తెన్నూ లేకుండా సాగిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump).. ఇన్నాళ్లకు తన మనసులో మాట బయటపెట్టేశారు. సరైన కారణం లేకుండా ఇరాన్ యుద్ధం మొదలుపెట్టారంటూ ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖర్గ్ ద్వీపంపై దాడి చేసి ఇరాన్ లో చమురు స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యమన్నారు.
ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని (kharg island) ఆక్రమించుకోవచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. గతంలో వెనెజులాపై సైనిక చర్య చేపట్టి అక్కడి చమురుపై ఆధిపత్యం సాధించిన ట్రంప్.. ఇప్పుడు ఖర్గ్ ద్వీపంపై దాడిని సైతం దాంతో పోల్చారు. నిజం చెప్పాలంటే, ఇరాన్లోని చమురును స్వాధీనం చేసుకోవడమే తనకు అత్యంత ఇష్టమైన విషయం అన్నారు. కానీ అమెరికాలోని కొంతమంది మూర్ఖులు, మీరెందుకు అలా చేస్తున్నారు? అని అంటారని, కానీ వాళ్ళు మూర్ఖులు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

మనం ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, లేదా చేసుకోకపోవచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి, అలాంటప్పుడు అక్కడ కొంతకాలం ఉండాల్సి వస్తుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణ గల్ఫ్ దేశాలకు వ్యాపించి, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల ప్రమాదాన్ని పెంచుతూ, ముడి చమురు ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ లో భూతల దాడులకు 10వేల మంది సైనికుల్ని ఇరాన్కు ట్రంప్ పంపుతున్నారు. అయితే ఇరాన్ లో భూతలదాడులు తీవ్ర ప్రమాదకరమని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నా ట్రంప్ లెక్క చేయట్లేదు.

పాకిస్తానీ 'దూతల' మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయని, అవి సానుకూల పురోగతిని సాధిస్తున్నాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని ముగించే షరతులకు అంగీకరించడానికి లేదా దాని ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులను ఎదుర్కోవడానికి ఇరాన్ కు ట్రంప్ ఏప్రిల్ 6వ తేదీని గడువుగా విధించారు.
కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చనిపోయి ఉండవచ్చని లేదా తీవ్రంగా గాయపడి ఉండవచ్చని ట్రంప్ మరోసారి తెలిపారు.












Click it and Unblock the Notifications