ఆయనలో రాముణ్ణి, కృష్ణుణ్ణి చూశా.. ఆ స్పర్శతో నా జన్మ ధన్యమైంది
ప్రముఖ నటుడు, రచయిత, వాగ్గేయకారుడు తనికెళ్ల భరణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా అత్యంత భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన ప్రధాని మోదీని బేగంపేట విమానాశ్రయంలో భరణి కలిశారు. ఈ భేటీ అనంతరం తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, మోదీ పట్ల తనకున్న అచంచలమైన గౌరవాన్ని చాటుకున్నారు.
ప్రధాని మోదీని కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ భరణి ఇలా రాశారు.. "నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే మనం ఇప్పుడు వాళ్ళను చూడలేము కూడా. కానీ, వాళ్ళందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం" అంటూ తన అనుభూతిని అక్షరబద్ధం చేశారు. ప్రధానిని ఒక మహోన్నత శక్తిగా అభివర్ణిస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఎయిర్పోర్ట్ రన్వేపై ఆత్మీయ పలకరింపు
హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరిన ప్రధానికి వీడ్కోలు పలికేందుకు తనికెళ్ల భరణి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విమానం ఎక్కే ముందు రన్వేపై ప్రధాని మోదీ భరణితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. భరణి అందించిన గౌరవానికి మోదీ కూడా అంతే ఆప్యాయంగా స్పందించారు. ఈ సందర్భంగా భరణి ప్రధాని చేతిని పట్టుకుని ముద్దాడటం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, వారి మధ్య ఉన్న బంధాన్ని చాటిచెప్పింది.
సాంస్కృతిక రాయబారిగా తనికెళ్ల భరణి
కేవలం నటుడిగానే కాకుండా తెలుగు సంస్కృతి, ఆధ్యాత్మికతపై లోతైన అవగాహన ఉన్న భరణి, ప్రధాని మోదీలో భారతీయ పురాతన ధర్మం యొక్క ప్రతిరూపాన్ని చూశానని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా పలు సందర్భాల్లో మోదీ నాయకత్వాన్ని, ఆయన తీసుకునే నిర్ణయాలను భరణి ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా మోదీని సాక్షాత్తూ రాముడు, కృష్ణుడు, వివేకానందుడి అంశగా అభివర్ణించడంతో ఆయన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన ముగిసినా, ఆయనతో తనికెళ్ల భరణి సాగించిన ఆత్మీయ సంభాషణ, ఆ తర్వాత పెట్టిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.














Click it and Unblock the Notifications