MPTC, ZPTC ఎన్నికలపై బిగ్ అప్డేట్!
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. మే, జూన్ నెలల్లో అధికారులు పలు కీలక కార్యక్రమాల్లో తలమునకలు కానున్నారు. ప్రభుత్వం చేపట్టనున్న ఇంటింటి సర్వే బాధ్యతలను క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించడంతో వారు ఆ పనుల్లో నిమగ్నం కానున్నారు. దీనికి తోడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో, సర్కారీ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ ప్రక్రియలన్నీ ముగియడానికి జూలై ఆఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉండటంతో, అప్పటి వరకు ఎన్నికల ఊసే ఉండేలా కనిపించడం లేదు.

ఉద్యోగుల బదిలీల కోలాహలం..
ఎన్నికల జాప్యానికి మరో ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు. గత కొంతకాలంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ (జీవో నెం. 38) స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి బదిలీ అవకాశం కల్పిస్తుండగా, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి తప్పనిసరి బదిలీలు చేయనున్నారు.
2027 మే నాటికి పదవీ విరమణ చేసే వారికి మినహాయింపునిచ్చారు. ఒకే కేడర్లో గరిష్టంగా 40 శాతం కంటే ఎక్కువ బదిలీలు ఉండకూడదని ప్రభుత్వం నిబంధన విధించింది. ఉద్యోగులంతా ఈ బదిలీల ప్రక్రియలో ఉండటం వల్ల ఎన్నికల విధులకు సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది.
ఆగస్టు తర్వాతే షెడ్యూల్?
ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం జనగణన, ఉద్యోగుల స్థానచలనం, విద్యా రంగంపైనే పూర్తి దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలన్నీ సజావుగా పూర్తి కావాలంటే జూలై వరకు సమయం అవసరం. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై ప్రభుత్వం ఆగస్టు లేదా ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి తగ్గుముఖం పట్టనుంది.












Click it and Unblock the Notifications