AI Jobs: ఐదేళ్లలో 40 లక్షల ఏఐ ఉద్యోగాలు..! నీతి ఆయోగ్ లెక్క ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకూ సేఫ్ అనుకున్న ఐటీ ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయి. వాటి స్ధానాల్ని ఏఐ ఉద్యోగాలు ఆక్రమిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉద్యోగం కొనసాగాలంటే ఏఐ నైపుణ్యాలు నేర్చుకోక తప్పని పరిస్ధితి ఉద్యోగులకు ఎదురవుతోంది. అదే సమయంలో కొత్త ఏఐ ఉద్యోగాల రాక పెరుగుతోంది. ఇదే క్రమంలో భారత్ లో ఏఐ ఉద్యోగాలపై నీతి ఆయోగ్ అంచనాలను వెల్లడించింది.
2030 నాటికి అంటే వచ్చే ఐదేళ్లలోనే భారత్ లో 40 లక్షల ఏఐ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ ఇవాళ వెల్లడించింది. ముఖ్యంగా టెక్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలను ఏఐ సృష్టించబోతున్నట్లు తెలిపింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం ఈ వివరాలు వెల్లడించారు. నాస్కామ్ బీసీజీతో కలిసి ఈ నివేదిక తయారు చేసింది. 2035 నాటికి భారత్ ఏఐ రంగంలో గ్లోబల్ హబ్ గా మారబోతోందని ఈ నివేదికలో తెలిపారు.

ఏఐ దూకుడు కారణంగా క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్లు, లెవెల్ 1 సపోర్టింగ్ ఏజెంట్ల వంటి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఈ రిపోర్టు తెలిపింది. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఏఐ నైపుణ్యాల వృద్ధి, ఆవిష్కరణలు జరగకపోతే ఉద్యోగాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఇవి జరిగితే మాత్రం జాతీయ స్ధాయిలో ఆయా ఉద్యోగులు ఆస్తులుగా మారతారని తెలిపింది. ఏఐ దూకుడు కారణంగా టెక్నికల్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెనుమార్పులు తథ్యమని చెబుతోంది.

ఏఐ కారణంగా ఏఐ ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, రోబోటిక్స్ ఇంజనీర్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల రాక పెరగనుందని నీతి ఆయోగ్ రిపోర్ట్ చెబుతోంది. వీటితో పాటు కొత్త ఉద్యోగాలైన ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్, ఏఐ ట్రైనర్స్, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్, ఏఐ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ స్పెషలిస్ట్, ఏఐ లిటరసీ ట్రైనర్స్, స్పెషలిస్ట్, ఏఐ హెల్త్ కేర్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ వంటివి కూడా రాబోతున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications