JEE రాయకుండానే 14 మందికి IIT సీట్లు..! ఎలాగంటే?
మన దేశంలో ఐఐటీ (IIT) సీట్లు సంపాదించాలంటే జాతీయ స్ధాయిలో నిర్వహించి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్సెడ్ లో మెరుగైన ర్యాంక్ సాధించడం తప్పనిసరి. ముందుగా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసి, అందులో నుంచి అడ్వాన్సెడ్ కు ఎంపిక చేసే 2.5 లక్షల మందిలో ఉండాల్సిందే. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్సెడ్ లోననూ మెరుగైన ర్యాంక్ వస్తే తప్ప ఐఐటీల్లో సీటు దొరకదు. కానీ జేఈఈ అడ్వాన్సెడ్ రాయకుండానే 14 మంది విద్యార్ధులు ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) లో సీట్లు సాధించారు.
జేఈఈ రాయకుండానే ఐఐటీ సీటు (IIT)
ఐఐటీ కాన్పూర్ తన స్పెషల్ ఒలింపియాడ్ కోటా ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, సైన్స్ ప్రోగ్రామ్ల కోసం 14 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. దీంతో ఈ అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. జూన్ 15న దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం 17 మంది విద్యార్థులను షార్ట్లిస్ట్ చేశారు. ఈ అభ్యర్థులు జూన్ 24న ఐఐటి కాన్పూర్లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరయ్యారు. ఒక విద్యార్థి గైర్హాజరు కాగా, ఇద్దరిని వారి ప్రతిభ ఆధారంగా వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు.

ఒలింపియాడ్ తో అడ్మిషన్లు
పైనల్ గా ఐఐటీ కాన్పూర్ ఎంపిక చేసిన విద్యార్ధులు సంప్రదాయ జేఈఈ అడ్వాన్స్డ్ మార్గం గుండా వెళ్లకుండానే, దేశంలోనే ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలలో ఒక దాంట్లో తమ విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సీబీటీ పరీక్షను 3 గంటల వ్యవధిలో నిర్వహించారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుండి 15 ప్రశ్నలు అడిగారు. ఇలా ఎంపికైన విద్యార్థులలో, ఆరుగురు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, ఇద్దరు బయోలాజికల్ సైన్సెస్, బయోఇంజనీరింగ్లో, మిగిలిన వారు మ్యాథమెటిక్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, కెమిస్ట్రీ, డేటా సైన్స్ సంబంధిత ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందారు.

ఏంటీ ఒలింపియాడ్ ఆధారిత అడ్మిషన్లు ?
ఐఐటి కాన్పూర్ నిబంధనల ప్రకారం బయోలాజికల్ సైన్సెస్, బయోఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఎకనామిక్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సహా ఐదు ప్రధాన విభాగాలలో ఒలింపియాడ్ మార్గం ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. గుర్తింపు పొందిన ఒలింపియాడ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయకుండానే ఐఐటి కాన్పూర్లో నేరుగా ప్రవేశం పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ పథకం సైన్స్, మ్యాథ్స్ లో అసాధారణమైన విద్యా ప్రతిభను ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి ఇంజనీరింగ్, పరిశోధన కార్యక్రమాలలో ఒక ప్రత్యేక ప్రవేశ మార్గాన్ని అందించడానికి రూపొందించారు. అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాసే వారి మాదిరిగానే వయోపరిమితి నిబంధనలను పాటించాలి. 12వ తరగతిలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, గణితం సబ్జెక్టులను చదివి ఉండాలి. జోసా ద్వారా గతంలో ఏదైనా ఐఐటీలో ప్రవేశం పొందిన లేదా ప్రవేశం రద్దయిన విద్యార్థులు ఈ విధానం ద్వారా ప్రవేశానికి అర్హులు కారు.















Click it and Unblock the Notifications