గ్రూప్-1 నోటిఫికేషన్ పై రేపు కీలకనిర్ణయం తీసుకోనున్న టీఎస్పీఎస్సీ.. నిరుద్యోగుల్లో ఉత్కంఠ!!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను నోటిఫై చేస్తూ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కూడా ఉద్యోగాల నోటిఫికేషన్ లకు సమాయత్తమవుతోంది.

పరీక్షల తేదీకి మధ్య కొంత వ్యవధి ఉండేలా ప్రణాళికలు
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులను అధిగమించేలా రిక్రూట్మెంట్ బోర్డుల మధ్య సమన్వయం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో గ్యాప్ ఉండేలా పరీక్ష రాయదలుచుకున్న అభ్యర్థులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా పరీక్షల తేదీకి మధ్య కొంత వ్యవధి ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత షెడ్యూల్ లో ఏ విధమైన మార్పులు లేకుండా నిర్ణీత గడువులోగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలపై శనివారం టీఎస్పీఎస్సీ సమావేశం
ఇదిలా ఉంటే శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల పై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణపై దశల వారీగా సమావేశాలు నిర్వహించింది. ఉద్యోగాల భర్తీపై అన్ని శాఖలను సమన్వయం చేసుకొని చర్చలు జరిపింది. ఇక మూడు వారాల క్రితమే గ్రూప్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది.

గ్రూప్ 1 నోటిఫికేషన్ పై కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్
దీంతోపాటు కొత్త జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలో శనివారం రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫై కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. టీఎస్పీఎస్సీ ప్రకటన కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇంటర్వ్యూలు రద్దు చెయ్యటంతో పరీక్ష విధానంపై ఆసక్తి..
ఇదిలా ఉంటే గ్రూప్-1 పరీక్షలకు మొత్తం 1000 మార్కులు ఉండేవి. వీటిలో రాతపరీక్షకు తొమ్మిది వందల మార్కులు ఇంటర్వ్యూకు వంద మార్కులు ఉండేవి. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలిచేవారు . అయితే ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం ప్రకటించడంతో రాత పరీక్షల్లో ఏమైనా మార్పులు చేస్తారా అన్న సందేహం ప్రస్తుతం నిరుద్యోగులలో వ్యక్తమౌతుంది. ఇంటర్వ్యూలకు ఇప్పటివరకు కేటాయించిన మార్కులను కూడా రాతపరీక్షలో కలిపి నిర్వహిస్తారా అన్నది అభ్యర్థులకు ఉన్న అనుమానం. ఒకవేళ ఇదే కనుక జరిగితే పరీక్ష పేపర్ మోడల్ కూడా మారే అవకాశం ఉంది. మరి గ్రూప్-1 పరీక్షల నిర్వహణ విషయంలో రేపు జరగనున్న సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications