Fact Check : తూగో జిల్లా రామాలయంలో ఏసు ప్రార్ధనలు-బీజేపీ ఆరోపణలు ఫేక్ గా నిర్ధారణ
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ లోని పామర్రు పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న గంగవరం గ్రామం రామాలయంలో యేసు ప్రార్ధనలు జరిగాయంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.
ఈ విషయంపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాలాడుతూ గంగవరం గ్రామంలో కాదా మంగాయమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారని, అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని ఈ విషయంలో స్థానిక హిందువులు, క్రిస్టియన్లు కలసిమెలసి ఉంటున్నారని, ఎటువంటి వివాదాలు లేవని తెలిపారు.
ఇటీవల మంగాయమ్మకు, కాకినాడలో ఉంటున్న ఆమె పెద్ద కుమారుడైన కాదా శ్రీనివాస్ తో ఆర్ధిక వివాదాలు ఉండడం వలన తన తల్లి ప్రార్ధనల పేరుతో డబ్బు వృధా చేస్తుందని ఘర్షణ పడిన విషయంలో మంగాయమ్మ, మరికొందరు డయల్ 100 కు ఫోన్ చేయగా పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి తల్లి కొడుకులకు సర్ది చెప్పారు.
ఈ విషయమై కాదా శ్రీనివాస్ కు వరసకు సోదరుడైన అదే గ్రామంలో ఉంటున్న కాదా వెంకట రమణ తన అన్నయ్య కాదా శ్రీనివాస్ పై డయల్ 100 కు ఫిర్యాదు చేసారనే నెపంతో "రామాలయం లో ప్రార్ధనలు ఏ విధంగా పెడతారు" అని ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేయడం జరిగిందని ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈ విషయం లో ఎవరిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచాలకు నమ్మవద్దని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
Fact Check
వాదన
తూర్పుగోదావరి జిల్లా రామాలయంలో క్రైస్తవ ప్రార్ధనలు నిర్వహిస్తున్నారని పుకార్లు
వాస్తవం
తూర్పుగోదావరి జిల్లా రామాలయంలో క్రైస్తవ ప్రార్ధనలు జరగలేదని నిర్ధారణ