డాక్టర్ కె. కేశవరెడ్డి: మహబూబాబాద్ ఆర్టీసి కండక్టర్

పాఠకులందు ఉత్తమ పాఠకులు చాలా మందే ఉంటారు. సాహిత్యకారులను మించిన వివేచనశక్తి సాధారణ పాఠకులకు ఉంటుంది.

అల్ప విషయాలు

ఆలేరులోనో, జనగామలోనో సరిగా గుర్తు లేదు గానీ కొంతమంది మిత్రులతో కలిసి ఆర్టీసి బస్సెక్కాను. ఏ సంవత్సరం అనేది కూడా నిర్దిష్టంగా గుర్తు లేదు. బహుశా 1997 కావచ్చు. నేను ఆంధ్రప్రదేశ్ టైమ్స్ అనే ఆంగ్ల దినపత్రికకు నల్లగొంండ జిల్లా (పాత జిల్లా) కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను.

వరంగల్, హన్మకొండ, ఆపై నుంచి వచ్చే బస్సులను వేళలను బట్టి టిపిన్, లంచ్, డిన్నర్ కోసం ఆలేరులో ఎక్కువ సేపు నిలుపుతారు. సాయంత్రం పూట, కాస్తా చీకటి కూడా పడింది. ఆలేరులో బస్సు ఆగగానే సీటు రిజర్వ్ చేసుకుంటూ నా వద్ద ఉన్న పుస్తకాలను సీటుపై ఉంచి దిగిపోయాను.

తిరిగి బస్సెక్కగానే కండక్టర్ పుస్తకాలను చూస్తూ కనిపించాడు. ఏమిటి చూస్తున్నావు అని అడగా. డాక్టర్ అని ఉంటే డాక్టర్ కేశవరెడ్డి పుస్తకం అనుకుని చూస్తున్నాను అని చెప్పాడు. అంతటితో మా సంభాషణ ఆగిపోయింది.నేను సీటు మీద పెట్టిన పుస్తకం డాక్టర్ కె. లింగారెడ్డి కవిత్వం జలపాత శబ్దంలోకి.... ఆ పుస్తకం ఆవిష్కరణ సభకే వెళ్లి మేం తిరిగి నల్లగొండ వెళ్తున్నాం.

readers writer Dr k Keshav Reddy

బస్సు దిగేప్పుడు కండక్టర్‌ను అడిగాను - కేశవ రెడ్డి రచనలు అంటే ఇష్టమా, ఏవైనా చదివావా అని అడిగాను. చదివానని చెప్పాడు. తాను మహబూబాబాద్‌లో ఆర్టీసి కండక్టర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు. నిజానికి,మహబూబాబాద్ తెలంగాణలో ఓ మారుమూల ప్రాంతమనే చెప్పాలి.

కేశవరెడ్డిని రచయితలకే రచయితగా చెబుతారు. పైగా పాపులర్ లిటరేచర్ ఆయన రాయలేదు. చాలా సీరియస్ నవలా రచనలు చేశారు. స్మశానం దున్నేరు, రాముడుండాడు రాజ్యముండాది, ఇన్‌క్రెడిబుల్ గాడెస్, అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, మనెమ్మ వంటి నవలలు రాశారు.

కేశవరెడ్డి నవలలకు ఓ మారుమూల ప్రాంతంలో పాఠకుడు ఉన్నాడనే విషయాన్ని నేను నమ్మలేపోయాను. కండక్టర్ కూడా కవో, రచయితో అయి ఉండాలని అనుమానం కలిగింది. దాంతో మీరైమైనా రాస్తారా అని అడిగాను. లేదు, సార్ అన్నాడు. కవిత్వమైనా రాయరా అని అడిగాను. లేద్సార్ అని చెప్పాడు. రాసే అలవాటేమైనా ఉందా అని ప్రశ్నించాను.. లేదన్నాడు.

ఈ సంఘటన జరిగిన సమయంలో కేశవరెడ్డి రచనలపై వార్త దినపత్రికలో వివాదం నడుస్తోంది. ప్రముఖ రచయిత్రి రంగ నాయకమ్మ ఆ వివాదానికి తెర తీశారు. బహుశా చర్చ చివరి గుడిసె ముగింపు మీద అనుకుంటా. నవల ముగింపులో ప్రతినాయకుడిని కుక్క చంపుతుంది. బాధితులు పెంచుకున్న కుక్క అతన్ని చంపుతుంది. దీన్ని రంగనాయకమ్మ ప్రశ్నిస్తూ వివాదం ప్రారంభించినట్లు గుర్తు. వార్తలో రంగనాయకమ్మ కేశవరెడ్డి మీద రాసిన రాతలు చూశారా అడిగా. దానికి ఆ కండక్టర్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ - రంగనాయకమ్మకు వ్యతిరేకంగా వ్యాఖ్య చేశాడు.

అతని వ్యాఖ్యకు దిమ్మితిరిగి పోవడం అటుంచి, అంత వివేచనతో అతను ఆ రచనలు చదివాడని తెలిసి అబ్బురమనిపించింది. అతను కేశవ రెడ్డి రచనలను అంత సూక్ష్మస్జాయిలో అర్థం చేసుకున్నాడని తెలిసి కలిగిన అబ్బురం అది.

దాంతో అతను నన్ను ఆశ్చర్యపరచడం ఆపలేదు. నేను బస్సు దిగేప్పుడు కె. ప్రతాపరెడ్డి అంటే కాసుల ప్రతాపరెడ్డా సార్ అని అడిగారు. నా అక్రిడేషన్ కార్డు మీద కె. ప్రతాపరెడ్డి అని ఉంది. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు అది. అది ఉంటే, ఆర్టీసి బస్సు చార్జీలో వన్ థర్డ్ రాయితీ ఉంటుంది. టికెట్ తీసుకునే సమయంలో ఆ రాయితీ కోసం కండక్టర్‌కు చూపించాను. అది గుర్తు పెట్టుకుని అడిగాడు. అవునని చెప్పాను.

ఆ మాట నోటి నుంచి వచ్చిందో, లేదో మీదంతా తీవ్రవాదం కదా సార్ అన్నాడు. నా రచనల్లో ఏ విధమైన తీవ్రవాదం కనిపించిందో నాకు తెలియదు. కానీ రచనలు కాస్తా ఘాటుగా ఉండేవి. పెద్ద పెద్దవాళ్లకు కూడా మింగుడుపడేవి కావు. బహుశా అందువల్ల అతను నా రచనలపై ఆ విధమైన వ్యాఖ్య చేసి ఉంటాడని సర్దిచెప్పుకున్నాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన రచనలకు పాఠకులు ఉంటారు. ఆ పాఠకులు వ్యక్తిగత సంబంధాల్లోకి రారు కాబట్టి మనకు తెలియదు. మన రచనలు అటువంటివారి కోసమే అనుకున్నప్పుడు మనకు గుర్తింపు సమస్య ఉండదు.

- కాసుల ప్రతాపరెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+