వీరప్పన్ దొరకడంఅసాధ్యం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తు కుదిరింది. సీట్ల సంఖ్య కూడా ఖరారైంది. వామపక్షాలతో మార్చి 2వ తేదీన పొత్తు చర్చలు కొలిక్కి వస్తాయంటున్నారు. వామపక్షాలతో పొత్తు కుదరడం ఖాయమనేది అందరికీ అర్థమైన విషయం. టిఆర్ఎస్కు ఇచ్చే సీట్ల సంఖ్య కూడా ఖరారైంది. అయితే ఏయే సీట్లను కాంగ్రెస్ టిఆర్ఎస్కు, వామపక్షాలకు ఇస్తుందనేది ఇంకా తేలలేదు. ఇది తేల్చడం కత్తి మీద సాములాంటిదే. కాంగ్రెస్ సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలను కొన్నింటిని టిఆర్ఎస్, వామపక్షాలు కోరుతున్నాయి. ఇది కాంగ్రెస్కు గుదిబండగా మారే ప్రమాదం ఉంది.
టిఆర్ఎస్ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో బలంగా ఉంది. మిగతా జిల్లాల్లో అంత బలంగా లేదు. రెండు మూడు జిల్లాల్లో బలంగా ఉన్న టిఆర్ఎస్కు 42 స్థానాలు ఇవ్వడమేమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అందుకే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పొత్తు వల్ల టిఆర్ఎస్ ఎక్కువ లాభపడిందని కూడా ఆయన అంటున్నారు. అయితే కొన్ని త్యాగాలు తప్పవనే నిర్దిష్టమైన అంచనాతోనే కాంగ్రెస్ పొత్తుల బరిలోకి దిగింది. వామపక్షాలు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వామపక్షాలకు చెందిన కొన్ని సీట్లను కాంగ్రెస్ గెల్చుకుంది. దీని వల్ల పాత సీట్లను అవి కావాలని పట్టుబట్టే అవకాశం ఉంది.
ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట శాసనసభా నియోజకవర్గం నుంచి రద్దయిన శాసనసభలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సీటును టిఆర్ఎస్ కోరుతోంది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలు, కరీంనగర్ జిల్లా ఇందుర్తి, బుగ్గారం, చొప్పదండి, వరంగల్ జిల్లాలోని చేర్యాల, ములుగు నియోజకవర్గాలు, మెదక్ జిల్లాలోని రామాయంపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం, మిర్యాలగుడ, రామన్నపేట నియోజకవర్గాలు టిఆర్ఎస్ అడుగుతున్న సీట్లలో ఉన్నట్లు సమాచారం. ఈ స్థానాల నుంచి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. అందువల్ల ఈ సీట్లను టిఆర్ఎస్కు కేటాయించడం కాంగ్రెస్కు అంత సులభమేమీ కాదు. సిట్టింగ్లను కాదని టిఆర్ఎస్కు కేటాయిస్తే అసమ్మతి తలెత్తి తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి దిగే ప్రమాదం ఉంది. దీన్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందనేది చిక్కు ప్రశ్న. అలాగే నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గాన్ని కూడా టిఆర్ఎస్ అడుగుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిని కాదని కాంగ్రెస్ టిఆర్ఎస్కు ఆ సీటును కేటాయిస్తుందా అనేది ప్రశ్న. నిజానికి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి, మిర్యాలగూడాలలో టిఆర్ఎస్ అంత బలంగా లేదు. అయితే అక్కడ ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. మిర్యాలగుడా నుంచి విజయసింహారెడ్డిని, తుంగతుర్తి నుంచి బుచ్చిరాములును పోటీకి దించేందుకు టిఆర్ఎస్ ఆ స్థానాలను అడుగుతోంది. వీరికి టికెట్ ఇవ్వడం టిఆర్ఎస్కు అవసరం కూడా. నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో, వరంగల్ జిల్లాలోని చేర్యాల, జనగాం జిల్లాల్లో టిఆర్ఎస్ బలంగా వుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా క్లీన్స్వీప్ చేసింది. చేర్యాల నుంచి కాంగ్రెస్ రద్దయిన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దాన్ని టిఆర్ఎస్కు ఇవ్వకతప్పదు.
ఇకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన స్థానాలను కొన్నింటిని వామపక్షాలు కూడా కోరుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి నియోజకవర్గాన్ని సిపిఐ కోరుతుంది. వరంగల్ జిల్లాలోని జనగామను సిపిఎం కోరుతుంది. గత ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని కాంగ్రెస్ ఓడించింది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య గెలుపొందారు. ఆయనను కాదని సిపిఎంకు ఆ స్థానం కేటాయించడం కాంగ్రెస్కు కష్టమే. అలాగే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, రామన్నపేట నియోజకవర్గాలను సిపిఐ, నక్రేకల్, నల్లగొండ, మిర్యాలగుడా స్థానాలను సిపిఎం కోరుతున్నాయి. నక్రేకల్ను సిపిఎంకు ఇవ్వడం కష్టమేమీ కాదు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి సిపిఎం ప్రాతినిధ్యం వహిస్తోంది. మిర్యాలగూడా సీటును సిపిఎంతో పాటు టిఆర్ఎస్ కూడా కోరుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నియోజకవర్గం కేటాయింపు వివాదాస్పదంగా మారే ప్రమాదం ఉంది.
ఖమ్మం జిల్లాలో ఖమ్మం, బూర్గుంపహాడ్, సుజాత్నగర్ నియోజకవర్గాల నుంచి రద్దయిన శాసనసభకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వీటిని సిపిఐ కోరుతోంది. ఈ నియోజకవర్గాల పంపకం కాంగ్రెస్ మిత్రపక్షాల మధ్య వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. వామపక్షాలతో పొత్తు వల్ల ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ త్యాగాలు ఎక్కువ చేయాల్సి రావచ్చు. టిఆర్ఎస్ వల్ల కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో త్యాగాలు చేయాల్సి రావచ్చు. అలాగే అసమ్మతులు, తిరుగుబాట్లు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. దీని నుంచి కాంగ్రెస్, టిఆర్ఎస్లు ఎలా బయటపడుతాయనేది వేచి చూడాల్సిందే. టికెట్లు ఇవ్వలేని నాయకులను బుజ్జగించే విషయంలో కాంగ్రెస్ నాయకత్వం అనుసరించబోయే వ్యూహంపైననే పొత్తుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పొత్తుల వల్ల తలెత్తే అసమ్మతులను తెలుగుదేశం తనకు అనుకూలంగా మలుచుకునే ఎత్తుగడలో ఉంది. ఇప్పటికే ఆ పని ప్రారంభమైంది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకం పూర్తయితే తెలుగుదేశం వేగంగా పావులను కదపడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి ఒక సవాల్గా తీసుకుని పోటీ చేయడానికి టిఆర్ఎస్ సిద్ధపడుతోంది. తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, ముత్యంరెడ్డి, దేవేందర్ గౌడ్ వంటి హేమాహేమీలను ఓడించి తమ సత్తా చాటుకోవాలని టిఆర్ఎస్ భావిస్తోంది. అయితే టిఆర్ఎస్ స్వప్పం ఏ మేరకు ఫలిస్తుందనేది ఇప్పుడే చెప్పలేం.