పెద్ద హీరోలే ఇండస్ట్రీకి ప్రాబ్లమా?
నిర్మాతల సమస్యలు గానీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పట్టుతో ముందుకు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఇటీవల నాగబాబు దర్శకులపై విరుచుకు పడిన విషయాన్ని, సాక్షి టీవీలో చిరంజీవి సోదరులను ప్రశ్నిస్తూ ప్రసారం చేసిన వార్తాకథనాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. సమస్య అంతా పెద్ద హీరోల వల్లనే వచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు. సినిమాలు విజయం సాధిస్తే తమ గొప్పగానూ విఫలమైతే దర్శకుడిదో మరెవరిదో తప్పు అన్నట్లుగానూ వారు ప్రవర్తిస్తున్నారు. కథ విషయంలో, దర్శకత్వం విషయంలో కూడా వారు జోక్యం చేసుకుంటున్నారు. తమ ఇమేజ్ మాత్రం సినిమాకు విజయం సాధించి పెడుతుందని నమ్ముతున్నారు. దీంతో హెద్ద హీరోల సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద ఢమాల్ అంటున్నాయి. భారీ అంచనాలతో ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజా సినిమా ఆరెంజ్, మహేష్ బాబు ఖలేజా వంటి చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినా హీరోలు తమ రెమ్యునిరేషన్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తమతో సినిమాలు తీసి రోడ్డున పడుతున్న నిర్మాతల గురించి వారు పట్టించుకోవడం లేదు. తమిళంలో రజనీకాంత్ లాగా ఉదారంగా ఉండడం అనేది వారి ఒంట్లో లేని విషయం. ఆ మాట ఎవరైనా అంటే దుమ్మెత్తిపోయడం వారికి అలవాటుగా మారింది. ఒక రకంగా తెలుగు సినిమాను మాస్ హీరోలుగా చెప్పుకుంటున్న పెద్ద హీరోలు శాసించడమే పెద్ద శాపంగా మారింది.
ప్రస్తుత పీటముడికి తమ బాధ్యత ఉందని మూవీ ఆర్టిస్టుల సంఘం గుర్తించినట్లే ఉంది. సినిమా షూటింగులు ఆగిపోయిన నేపథ్యంలో మురళీమోహన్ అధ్యక్షతను మూవీ ఆర్టిస్టుల సంఘం సమావేశమైంది. నటులు రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రెమ్యునరేషన్ వాయిదాల పద్ధతుల్లో తీసుకోవడానికి, సినిమాలు ఫెయిల్ అయితే నిర్మాత నష్టాల్లో పాలు పంచుకోవడానికి వారు ముందుకు వచ్చారు. మొత్తం సినిమా నిర్మాణంలో హీరోల రెమ్యునరేషనే అత్యధిక ఖర్చు అయిన నేపథ్యంలో నిర్మాతలకు ఈ నిర్ణయాలు కొంత ఊరట కలిగించే విషయమే. ఇదేమైనా పరిస్థితిలో మార్పు తెస్తుందా అనేది చూడాలి. అయితే, నిర్మాతలు పెద్ద హీరోల వల్ల మాత్రమే సినిమా ఆడుతుందనే అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కథాబలం లేకుండా ఏ సినిమా కూడా విజయం సాధించదనే విషయాన్ని వారు గుర్తించాల్సి ఉంటుంది. ఈ విషయంలో దర్శకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పెద్ద హీరోలతో సినిమాలు తీయడమే అదృష్టంగా భావించే స్థితి నుంచి దర్శకులు బయటపడాలి.