భానుడి భగభగలు: తెలంగాణలో మాడిపోతున్న పంటలు.. నార్త్‌కు వడగాలుల ముప్పు

మండువేసవిలో సూర్య భగవానుడి భగభగలతో వాయవ్య భారతం మొదలు దేశమంతా సతమతం అవుతోంది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) పరిధిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వారాంతంలోగా ప్రమాదకర వడగాలులు వీస్తాయని నిపుణులు చెప్తున్నా

న్యూఢిల్లీ/హైదరాబాద్: మండువేసవిలో సూర్య భగవానుడి భగభగలతో వాయవ్య భారతం మొదలు దేశమంతా సతమతం అవుతోంది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) పరిధిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వారాంతంలోగా ప్రమాదకర వడగాలులు వీస్తాయని నిపుణులు చెప్తున్నారు. బుధవారం 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

గురువారం నుంచి శనివారం వరకు 40 - 41 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డవుతుందని అంచనా వేస్తున్నారు. లక్నో, నాగ్‌పూర్, ఇండోర్ తదితర పట్టణాల్లో వడగాలులు వీస్తాయని చెప్తున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం సర్వ సాధారణమేనని చెప్తున్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వరి పొలాలు మలమలా మాడిపోతున్నాయి.

వచ్చే ఆదివారం నుంచి వాయవ్య భారతంలోని ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర మధ్య భారతం, వాయవ్య భారతంలో ఉష్ణోగ్రతలు 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డవుతుందని తెలుస్తోంది.

ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లే వారు వెంట నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లడంతోపాటు తేలికపాటి దుస్తులు ధరించడం సబబని సూచిస్తున్నారు. వడదెబ్బ వల్ల తెలంగాణలో 18 మంది మరణించారు.

తల్లడిల్లుతున్న దక్షిణ భారతం

తల్లడిల్లుతున్న దక్షిణ భారతం

కొద్ది రోజులుగా దక్షిణ భారతంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు కురిసినా ఎండ తీవ్రత నుంచి ప్రజలు తప్పించుకోలేకపోతున్నారని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ ‘స్కైమేట్' తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో గోవా, దక్షిణ కొంకణ్ మధ్య ఏర్పడిన ఏర్పడిన అల్ప పీడనం దక్షిణ కేరళ వైపు మళ్లుతున్నది. దీని ప్రభావంతో కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 24 గంటల నుంచి 48 గంటల్లోపు స్వల్పం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా కర్ణాటక, తమిళనాడులోని మారుమూల ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నాణ్యత తగ్గుతుందేమోనన్న ఆందోళన

నాణ్యత తగ్గుతుందేమోనన్న ఆందోళన

రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో నీటి ఎద్దడి గల ప్రాంతాల్లో వరి పొలాలు తల వాల్చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో లక్షన్నర ఎకరాలకు పైగా వరి పొలాలు మలమల మాడిపోయాయని వ్యవసాయ శాఖ గుర్తించింది. దీనివల్ల ధాన్యం దిగుబడి, దాని నాణ్యతపైనా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో చలి తీవ్రత పెరుగడం వల్ల వరి నారు దెబ్బ తిన్నా.. ఆ సమస్యను అధిగమించి రబీ పంట సాగు చేసిన రైతులను అధిక ఉష్ణోగ్రతలు దెబ్బతీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంటలపై ఎండల తీవ్రత ప్రభావాన్ని గుర్తించేందుకు రాజేంద్రనగర్‌లోని భారత వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్‌ఆర్‌) పరిశోధన నిర్వహిస్తోంది.

 నిత్యం నీరు పారిస్తే బెటర్

నిత్యం నీరు పారిస్తే బెటర్

వరిపై అధిక వేడి ప్రభావాన్ని ఐఐఆర్‌ఆర్ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అయితే 40 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతల్లోనే మంచి దిగుబడి ఇస్తుందని, అంతకుమించితే ప్రభావం అధికంగా ఉంటుందని ఐఐఆర్‌ఆర్‌ డైరెక్టర్ డాక్టర్‌ రవీంద్రబాబు చెప్పారు. గింజ గట్టిపడే దశలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల్లోపు ఉంటే నాణ్యమైన ధాన్యం ఉత్పత్తి అవుతుందన్నారు. నీరు లభ్యత కూడా చాలా ముఖ్యమని, రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నందున గింజ గట్టిపడే దశలో ఉన్న పొలాల్లో నీరు పెట్టాలన్నారు. అధిక వేడికి బియ్యపు గింజ ఏర్పడడంలో సమస్యలు వస్తాయని, ఉత్పాదకత, నాణ్యత తగ్గుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ రబీలో ఆలస్యంగా నాట్లు వేసి ఇంకా కోతకు రాని పైర్లకు నిరంతరం నీరందించడం అత్యవసరమని అన్నారు.

 ఎండ వేడితో విలవిలలాడుతున్న కోళ్ల ఫారాలు

ఎండ వేడితో విలవిలలాడుతున్న కోళ్ల ఫారాలు

మొక్కజొన్న పంటపై వేసవి తీవ్రత గురించి పరిశోధన జరిపిన అమెరికాలోని ఐయోవా విశ్వవిద్యాలయం 37 డిగ్రీలకన్నా అధిక ఉష్ణోగ్రత ఐదు రోజులకు మించి ఉంటే దిగుబడి బాగా తగ్గుతుందని గుర్తించింది. అంతకంటే తక్కువ ఎండల్లోనూ భూమిలో తగినంత తేమ ఉండాలని సూచించిది. గోధుమ, సోయాచిక్కుడు వంటి పంటలూ అధిక ఉష్ణోగ్రతల్లో ఎక్కువగా దెబ్బతింటాయి. సజ్జకు మాత్రం సరైన నీరు ఉంటే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ దిగుబడి తగ్గదని భారత తృణధాన్యాల పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ దయాకర్‌రావు తెలిపారు. కాగా, ఎండలు మండిపోతుండడంతో ఫారాల్లోని బ్రాయిలర్‌ కోళ్లు విలవిల్లాడుతున్నాయి. ఫారాల్లో చల్లదనం కోసం చుట్టూ నీరు చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే బ్రాయిలర్‌ కోళ్లు చనిపోతాయని జయశంకర్‌ వర్శిటీ సంచాలకుడు డాక్టర్‌ రాజిరెడ్డి చెప్పారు.

 పడిపోతున్న భూగర్భ జల మట్టం

పడిపోతున్న భూగర్భ జల మట్టం

ఎండ తీవ్రత కారణంగా భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడంతో వేల బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.56 మండలాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఏడాది రాష్ట్రంలో సాధారణ వర్షపాతం, అంతకంటే ఎక్కువే నమోదైనా భూగర్భ జలాలు గతంలోకన్నా అట్టడుగు చేరడం ఆందోళనకర పరిణామం. సిద్ధిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూలు, నల్గొండ జిల్లాల్లోని 56 మండలాల ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మరో 73 మండలాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. సాధారణంగా పది మీటర్లు అంతకంటే తక్కువ లోతులో భూగర్భజలాలు ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు భావిస్తారు. రాష్ట్రంలో 326 మండలాల్లో మాత్రం పదిమీటర్లు, అంతకంటే తక్కువ లోతులో అందుబాటులో ఉన్నాయి.

మిగిలిన 258 మండలాల్లో భూగర్భ జలాలు 44 మీటర్ల లోతుకు పడిపోయాయి. 20 మీటర్లు అంతకంటే ఎక్కువ లోతున నీరున్న 56 మండలాల్లో వేల బోర్లు ఇప్పటికే ఎండిపోగా నిత్యం నీరు రానివాటి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదని రైతులు చెప్తున్నారు.. సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యంత అట్టడుగున 44.18 మీటర్ల లోతున భూగర్భజలాలు ఉన్నాయి. 30 అడుగులు అంతకంటే లోతున జలాలు ఉన్న రాజాపూర్‌, కల్వకుర్తి, వెల్దండ, ఫరూఖ్ నగర్‌, కొల్చారం, జహీరాబాద్‌, తదితర మండలాల్లో ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 19 మండలాల్లో గత ఏడాది మార్చికన్నా భూగర్భజల మట్టాలు పడిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+