ఎన్టీఆర్ ను కట్టేసిన బాబు
స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు ఒక్కటొక్కటే ఫలిస్తున్నాయి. తొలుత తన కుమారుడు లోకేష్ కు నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని చేసుకున్నారు. తద్వారా బాలకృష్ణ అనివార్యంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై ఆశలను బాలకృష్ణ పక్కన పెట్టాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నందమూరి తారకరత్న, కల్యాణ్ రామ్ తమ బాబాయ్ బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబడుతూ వచ్చారు. చంద్రబాబుతో ఉన్న కుటుంబ బాంధవ్యంతో బాలకృష్ణ వారిని చల్లబరచాల్సి వచ్చిందని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తుండడం కూడా వివాదంగా మారింది. స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో కలతలు కూడా మొదలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను చేరదీయడానికి తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తద్వారా ఆయన గత ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి దిగారు. ఇప్పుడు తన మేనకోడలి కూతురు లక్ష్మీప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చి వివాహం చేయడానికి నిర్ణయం తీసుకోవడం ద్వారా మరోసారి చంద్రబాబు పైచేయి సాధించారు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ హావభావాలను, ముఖకవళికలను, శరీర కూర్పును సంతరించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అందివచ్చిన అవకాశంగా భావించవచ్చు. తన రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ ను తన కుటుంబంలోకి చంద్రబాబు తెచ్చుకుంటున్నారని భావించవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పటికైనా నందమూరి కుటుంబంలోకి రావాలని, తాత స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాడు. బాబాయ్ లను, ఇతర కుటుంబ సభ్యులను దగ్గర చేర్చుకోవడానికి తన ప్రతిభను, మాట తీరును, వ్యవహార శైలిని చాలా జాగ్రత్తగా వాడాడు. మామ చంద్రబాబు కుదిర్చిన వివాహానికి అంగీకరించడం ద్వారా నందమూరి కుటుంబ సభ్యుల్లో అతను అధికారికంగా చేరిపోయినట్లు భావించవచ్చు.