జగన్ బోల్తా పడతారా?

వైయస్ జగన్ స్పష్టంగా రాష్ట్ర కాంగ్రెసును రెండు విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యను అసమర్థుడిగా చిత్రీకరించేందుకు జగన్ వర్గం తొలుత ప్రయత్నించింది. ఇప్పుడు ఆయనను తమ ప్రత్యర్థిగా భావిస్తోంది. రోశయ్య తన వర్గంవారితో కలిసి జగన్ ను అణచివేసేందుకు కుట్ర చేస్తోందని దుమ్మెత్తి పోసేందుకు వెనకాడడం లేదు. మొత్తంగా, పార్టీ అంతర్గత పోరును రోశయ్య, జగన్ వర్గాల మధ్య సమరంగా మార్చేశారు. అధిష్టానం తనకు ఇంకా అనుకూలంగానే ఉందని జగన్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పరిస్థితి ఆయన చెప్పినట్లు లేదు. అధిష్టానం ఆదేశాల మేరకే రోశయ్య గానీ, ఇతర నాయకులు గానీ జగన్ ఓదార్పు యాత్ర తీరును వ్యతిరేకిస్తున్నారు. జగన్ ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికితోడు, వైయస్ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా విప్పుతున్నారు.
ప్రజాబలం ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తున్న జగన్ శాసనసభ్యులను తన వైపు తిప్పుకునేందుకు తీవ్రమైన పట్టుదలతో పనిచేస్తున్నారు. వారికి ఫోనులు చేస్తూ తన ఓదార్పు యాత్రకు రావాలని పిలుస్తున్నారు. శాసనసభ్యులపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టడమే అనుమానాలకు తావిస్తోంది. రోశయ్యకు వ్యతిరేకంగా మెజారిటీ శాసనసభ్యులను కూడగట్టాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. పైగా, ఆయన తన యాత్రల్లో సోనియా పేరును గానీ రాహుల్ పేరును గానీ ప్రస్తావించడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలకు గండి కొడుతుందని విమర్సిస్తున్నారు. వీటన్నింటినీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగానే అధిష్టానం భావిస్తోంది. ప్రజాబలం ఉన్న జగన్ శాసనసభ్యుల వెంట పడడమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. లోపల రోశయ్య ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచన లేకపోతే జగన్ ఆ విధంగా ప్రవర్తించబోరని అంటున్నారు. మొత్తం మీద, జగన్ తన బలాన్ని కూడా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారని అనిపిస్తోంది. తాను పిలిస్తే శాసనసభ్యులు పరుగెత్తుకొస్తారని, ప్రజలు తండోపతండాలుగా కదిలివస్తారని ఆయన చాటి చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తన శక్తిని, బలాన్ని జగన్ ఇదే పద్ధతిలో ఎక్కువగా అంచనా వేసుకుంటే బోల్తా పడడం ఖాయమని అంటున్నారు.












Click it and Unblock the Notifications