రాయపాటిపై పురంధేశ్వరి ఎఫెక్ట్?
రాయపాటి సాంబశివరావుతో పాటు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావపడం విశేషం. ఈ స్థితిలో ఇంత మందికి మంత్రి పదవులు లభించడం కష్టమే. కేంద్ర మంత్రి పదవి కోసం లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ కలిసి ఇటీవల కాంగ్రెసు అధిష్టానానికి చెందిన కొంత మందిని కలిశారని చెబుతున్నారు. ఈ సమయంలో అధిష్టానం అంతరంగం స్పష్టంగా బయటపడిందని చెబుతున్నారు. వస్తే గిస్తే లగడపాటి రాజగోపాల్ కు సహాయ మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. దానికి తోడు, పార్టీ రాజకీయాల్లో రాయపాటి కన్నా కావూరి సాంబశివరావుకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరిస్థితిలో తనకు మంత్రి పదవి దక్కడం కల్లే అని రాయపాటి తేల్చుకున్నారని, అందుకే రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారని అంటున్నారు. ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలు సాగిస్తోంది.
మరోవైపు, గుంటూరు జిల్లా కాంగ్రెసు రాజకీయాలు కూడా రాయపాటి సాంబశివ రావుకు వ్యతిరేకంగా సాగుతున్నాయి. మంత్రి కన్నా లక్ష్మినారాయణకు ఆయనకూ క్షణం పడడం లేదు. కన్నా లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇవ్వకూడదని, ఆయన అక్రమాస్తులపై విచారణ జరిపించాలని రాయపాటి డిమాండ్ చేస్తూ వచ్చారు. అయినా పార్టీ అధిష్టానం కన్నా లక్ష్మినారాయణకు అనుకూలంగానే వ్యవహరించింది. కాపు సామాజిక వర్గానికి చెందినందు వల్ల కన్నా లక్ష్మినారాయణ ప్రాధాన్యాన్ని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. అంబటి రాంబాబు వైయస్ జగన్ వైపు వెళ్లిన నేపథ్యంలో కన్నా లక్ష్మినారాయణ గుంటూరు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. తన సోదరుడు, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ కైనా రాష్ట్ర మంత్రివర్గంలో చేటు లభిస్తుందని ఆశించారు. ఆ ఆశ కూడా వమ్మయింది. ఇదంతా రాయపాటి మనసును కలత చెందినట్లు భావించవచ్చు.