లగడపాటి 'చిరు'వాదం?
చిరంజీవి సమైక్యాంధ్రప్రదేశ్ కోసం తెలంగాణలో పార్టీనే బలి పెట్టుకున్నారు. సమైక్యనినాదంతో రాయలసీమ, కోస్తాంధ్రలో విస్తృతంగా పర్యటించారు. తన మేనల్లుడు అల్లు అర్జున్, తన బంధువుల సినిమాలను తెలంగాణలో ఆడనీయకున్నా భరిస్తున్నారు. తెలంగాణవాదులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షలకు దిగిన లగడపాటి రాజగోపాల్ ను, తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమా మహేశ్వర రావును పరామర్శించి తన సమైక్య వాదాన్ని చాటుకున్నారు. అటువంటి చిరంజీవి సమైక్య వాద సభలో కనిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఈ సమైక్యవాద సభకు చిరంజీవి ఎందుకు రాలేదని తెలియడం లేదు. ఆహ్వానం అందినా రాలేదా, అసలే ఆహ్వానమే అందలేదా అనేది అంతుబట్టడం లేదు. దీనిపై మీడియా గానీ, రాజకీయ నాయకులు గానీ ఏమీ మాట్లాడడం లేదు. తెనాలి సమైక్యవాద సభలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు తెలంగాణవాదులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని ప్రతిజ్ఞ చేశారు. తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు, కోడెల శివప్రసాద రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, యనమల రామకృష్ణుడు, ఇంకా పలువురు పాల్గొన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు కలిసి వేదికను పంచుకున్నప్పుడు చిరంజీవితో పంచుకోవడానికి వచ్చిన ఆటంకమేమిటో తెలియడం లేదు. చిరంజీవి ప్రజాకర్షణ తమకు అడ్డు వస్తుందని భావించారా, తెలియడం లేదు. ఏమైనా, సమైక్యవాద నాయకులే జవాబు చెప్పాల్సి ఉంటుంది