చిరంజీవి మెగా ఫెయిల్యూర్
నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిసిస్ పీడిత ప్రజలను కూడా పలకరించి, వారికి భవిష్యత్తుపై ఆశలు కల్పించారు. ఫ్లోరోసిస్ తాకిడికి గురై అక్కడి ప్రజలు కాళ్లొంకర, పళ్లొంకర... వారి దీనస్థితికి చిరంజీవి కరిగిపోయారు. కానీ వారి బతుకులు తెల్లారలేదు. పార్టీ జెండా మోసినవారు, పార్టీ పతాకలను తయారు చేసినవారు ఒక్కరేమిటి అందరినీ చిరంజీవి నిరాశపరిచారనే చెప్పాలి. తొలిసారి ఎన్నికల్లో గెలవనంత మాత్రాన ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన అనుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఓడిపోయిన కసిలో చాలెంజ్గా తీసుకుని పార్టీని తీర్చిదిద్దడంలో చిరంజీవి విఫలమయ్యారనే చెప్పాలి. ఓటమి విజయానికి మెట్టు అనే సూక్తిని పూర్తిగా విస్మరించారాయన.
ఇకపోతే, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం గ్రాండ్గా జరగాలని చిరంజీవి ఆశ పడ్డారు. కానీ, అదేమీ లేకుండానే విలీన ప్రక్రియ ముగిసిపోతోంది. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అనుకున్నారు. అది కూడా జరగడం లేదు. ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నెల 20వ తేదీన కాంగ్రెసు తీర్థం పుచ్చుకోబోతున్నారు. సోనియా గాంధీ అనారోగ్యంతో అమెరికాలో ఉండడంతో ఆమె లేకుండానే విలీన ప్రక్రియ పూర్తవవుతోంది. నిజంగానే, రాజకీయాల్లో చిరంజీవి నెంబర్ వన్ కాలేకపోయారు.