తెలంగాణ, ఓ సుదూర స్వప్నం
తమ పార్టీ అధిష్టానం వ్యూహానికి అనుగుణంగానే రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు మాత్రం తెలంగాణ ఊసే మరిచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రాబల్యాన్ని, దూకుడుని తగ్గించడానికి అనుగుణంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము అగ్రభాగాన ఉన్నట్లు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యక్రమాల్లో వారు ముందు భాగాన ఉంటున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కెసిఆర్ను విమర్శించడం లేదు గానీ తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం నిత్యం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఇదే రీతిలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం నడిపించదలుచుకున్నట్లు అర్థమవుతోంది.