అటు జగన్, ఇటు కెసిఆర్
కెసిఆర్ ప్రాబల్యం వల్ల తెలంగాణ ఇచ్చినా తమకు ఫలితం దక్కనే అభిప్రాయంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అటు సీమాంధ్రలోనైనా ఫలితం లభిస్తుందా అంటే వైయస్ జగన్ భయం పీడిస్తోంది. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ స్వీప్ చేస్తారని భావిస్తున్నారు. దానికితోడు, చాలా మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్తో వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కన్నా సీమాంధ్ర నుంచి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ ఇస్తే తాము జగన్ బాట పడుతామని వారు అధిష్టానానికి స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం అటకెక్కించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.
తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరితో తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నాయకులు తీవ్రమైన ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. అయితే, తెలంగాణ ప్రభావం తక్కువగా ఉన్న కోదాడ వంటి నియోజకవర్గాల శాసనసభ్యులు తెలంగాణ అంశంపై ఆందోళన చెందడం లేదు. దీంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుల్లో తెలంగాణ అంశంపై విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభావం అధికంగా ఉన్న శాసనసభ్యులు, లోకసభ సభ్యులు రాజీనామాలు చేస్తారా అనే ఆందోళన కూడా కాంగ్రెసు అధిష్టానాన్ని పీడిస్తోంది. దీంతో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం వైఖరిని తెలుసుకోవడానికి తెలంగాణ ప్రాంత నాయకులు ఆదివారం కె. కేశవరావును కలుసుకున్నారు, సోమవారం జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ ఇవ్వబోమని కాంగ్రెసు అధిష్టానం స్పష్టంగా చెప్పకుండానే దాన్ని దాటవేయాలని చూస్తోంది. తెలంగాణ ఇచ్చినా క్రెడిట్ అంతా కెసిఆర్ కొట్టుకుపోతారని, దానివల్ల పార్టీకి నష్టమేనని, కెసిఆర్ తెలంగాణలోని 119 శాసనసభా నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటారని, దానివల్ల తమకు లాభమేమీ ఉండదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది.