జగన్ పార్టీతో గుసగుసలు: లిస్ట్లో కావూరి, విష్ణు?
కాంగ్రెసు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గాలం వేస్తోందట. ఐదుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడల్లా తనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల కూడా ఆయన గంపెడాశలు పెట్టుకున్నారు. ఎప్పటిలాగే ఈసారీ ఆయనకు అధిష్టానం మొండిచేయి చూపింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో మాట్లాడిన తర్వాత కూడా ఆయన చల్లబడలేదు.
తనకు విస్తరణలో అవకాశం రాకపోవడంతో కావూరి సాంబశివ రావు కాంగ్రెసు అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కూతురుకు అధిష్టానం నుండి హామీ వచ్చాక ఆయన చల్లబడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన చల్లబడలేదని ప్రధాని భేటీ తర్వాత మరోసారి తేలింది. ఈయనకు జగన్ పార్టీ గాలం వేస్తోందని అంటున్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ పైన హామీ ఇస్తే జగన్కు జై కొట్టవచ్చునని అంటున్నారు. అయితే చీటికి మాటికి జగన్ పార్టీ పైన విమర్శలు గుప్పించే మల్లాది ఆ పార్టీలోకి వెళ్లకపోవచ్చునని అంటున్నారు.
పేర్ని నాని, జోగి రమేష్లను కూడా తమ పార్టీలోకి తీసుకునేందుకు జగన్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.
మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి డికె అరుణతో పడని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం కాంగ్రెసు పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో జగన్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
ఇటీవల ప్రధానితో భేటీ తర్వాత కావూరి మాట్లాడుతూ.. తాను రాజీనామాపై వెనక్కి తగ్గలేదని చెప్పారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే భావనతో ఆయన ఉన్నారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికల ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కావూరి జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు జగన్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
కావూరితో జగన్ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో కావూరి భవిష్యత్తు కార్యాచరణ తేలుతుందంటున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోసం కూడా జగన్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. విష్ణు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ వైపు వెళుతున్న ఎమ్మెల్యేల్లో కిరణ్ గ్రూపుగా చలామణి అవుతున్న వారే ఉంటున్నారు.
అదే వరుసలో మల్లాది కూడా ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. నగర పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన నేతతో విష్ణుకు పొసగదు. అతనిని అధ్యక్షుడిగా నియమించడంపై విష్ణు ఆగ్రహంతో ఉన్నారట. దీనిని గమనించిన జగన్ పార్టీ ఆయనను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు విష్ణుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయనను రంగంలోకి దింపారని చెబుతున్నారు.
సెంట్రల్ నియోజకవర్గంపై వచ్చే ఎన్నికల్లో తనకు హామీ లభిస్తే జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు విష్ణు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు పేర్ని నాని, జోగి రమేష్లపై కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దృష్టి సారించిందని చెబుతున్నారు. అయితే వారు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదట.
తెలంగాణ ప్రాంతం నుండి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మంద జగన్నాథం కూడా జగన్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణతో మందకు అసలు పొసగడం లేదు. మందకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకూడదని నిన్న జిల్లాకు వచ్చిన రాహుల్ గాంధీ జట్టు సభ్యుడు ప్రశాంత్ ఠాగోర్కు డికె అరుణ వర్గం నేతలు చెప్పారు. టిక్కెట్ రాని పక్షంలో మంద జగన్ పార్టీకి జై కొట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు.