రాములమ్మ స్థానం: కెసిఆర్పై పోటీకి జగ్గారెడ్డి సై?
అలాంటి నేతను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల్లో గట్టిగా ఎదిరించి మాట్లాడే వ్యక్తుల్లో జగ్గారెడ్డి ముఖ్యుడు. ఆయనలా కెసిఆర్ పైన నిప్పులు చెరగ కలిగే వారు లేరు. అలాంటి జగ్గారెడ్డి క్రమంగా జిల్లాలో తన బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారట. అందుకోసం ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారట. వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు.
తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి నుండి తన సతీమణిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారట. జగ్గారెడ్డి ఇటీవల సొంత జిల్లా మెదక్లో పోటీ చేయాలని కెసిఆర్కు సవాల్ విసిరారు. మెదక్ ఎంపిగా ప్రస్తుతం విజయశాంతి ఉన్నారు. ఆమె భువనగిరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కెసిఆర్ గతంలో కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచినప్పటికీ ఇప్పుడు తెరాస తరఫున అక్కడ పలువురు ఉన్నారు.
ఈ నేపథ్యంలో కెసిఆర్ తన చూపును మెదక్ వైపు సారిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి కాకుండా మెదక్ నుండి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. అదే సమయంలో జగ్గా రెడ్డి కూడా మెదక్ పార్లమెంటుపై కన్నేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉప్పు నిప్పులా ఉండే జగ్గారెడ్డి - కెసిఆర్లు కాంగ్రెసు, తెరాసల తరఫున మెదక్ పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కెసిఆర్ మెదక్ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కారణంగా ఆయనను ఓడించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే జగ్గారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.