తెలంగాణ ఇక అటకెక్కినట్లే, యథాతథ స్థితి
మీడియా కథనాల్లోని వివరాలు ఇలా ఉన్నాయి - వాస్తవానికి, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, గవర్నర్ వంటి కీలక పదవుల్లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, అప్పటికే ఉన్న వివిధ ముఖ్య అంశాలపై, వారికి అవగాహన కల్పించడానికి అప్పటి దాకా ఉన్న పరిస్థితిని హోంశాఖ నివేదిక (బ్రీఫ్) రూపంలో అందజేయడం సంప్రదాయం. ఇందులో భాగంగానే, కొత్త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదించడానికి కూడా కీలక అంశాలపై హోం శాఖ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, మహ్మద్ అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్, వివిధ రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు తదితర అంశాలను ఆ నోట్లో ప్రస్తావిస్తున్నట్లు ఆ నివేదికలో పాలుపంచుకుంటున్న ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అందులో సానుకూలత వ్యక్తం చేయలేదని, భౌగోళిక, ప్రాదేశిక కారణాల వల్ల తెలంగాణ ఏర్పాటు సాధ్యపడక పోవచ్చునని హోం శాఖ ఆ నోట్లో పేర్కొంటున్నట్లు వివరించాయి. శ్రీకృష్ణ కమిటీ క్రోడీకరించిన అంశాలను ప్రస్తావిస్తున్నట్లు తెలిపాయి. ఇక, తెలంగాణలో ప్రజలు ప్రస్తావిస్తున్న సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు, భద్రతలు, ఆర్థిక, సామాజిక రక్షణలు, అధికారాలను కల్పించడం సరైనదిగా ఉంటుందని, రాబోయే రెండేళ్లలో ఈ మేరకు తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం అభిప్రాయమని సూచించినట్లు వెల్లడించాయి.
రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ అంశంపై కేంద్రం స్పష్టతనిస్తుందని అటు తెలంగాణవాదులు, ఇటు సమైక్యాంధ్రవాదులు ఇప్పటి దాకా చెబుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం చెప్పబోయే విషయాన్నే రాష్ట్రపతికి నివేదన రూపంలో సంకేతప్రాయంగా వెల్లడిస్తుండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని విభజిస్తే అంతర్రాష్ట్ర జల వివాదాలు తీవ్రమవుతాయని, భౌగోళిక సమస్యలు వస్తాయని కేంద్రం భయపడుతోందని, అందుకే తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగా లేదని రాష్ట్రానికి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
తెలంగాణపై ఏదో ఒకటి తేల్చేయాలని, దానివల్ల 2014 ఎన్నికల్లోపు పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే అవకాశం పార్టీకి ఉంటుందని కూడా పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు పార్టీ అధిష్టానానికి చెప్పారు.. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన ఒక సీనియర్ నేతను సీఎంగా నియమించి, ఆయన ఆధ్వర్యంలోనే విభజనకు చర్యలు తీసుకోవాలన్న ప్రతిపాదనను కొందరు నేతలు అధిష్ఠానం ముందు ఉంచారు. అయితే, అధిష్ఠానం దానిని పక్కన పెట్టినట్లు తెలిసింది.
తాత్కాలిక విజయాల కోసం విభజన వంటి నిర్ణయాలకు కాంగ్రెస్ పూనుకోబోదని పార్టీనేత ఒకరు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ మార్పులు చేపట్టినా అది మొత్తం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఉంటుంది తప్పితే ఒక ప్రాంతాన్ని బట్టి ఉండదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇక సస్పెన్స్కు తెర వేయాలనే అభిప్రాయానికి అధిష్ఠానం వచ్చిందని, ఆగస్టు 8 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు ఈ విషయం ప్రకటించేందుకు తగిన సన్నాహాలు చేస్తోందని తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే కేంద్రం ప్రకటన చేస్తుందంటూ ఇటీవల వచ్చిన సంకేతాలకు అర్థం ఇదేనని సమాచారం.