బాలకృష్ణ, పరిటాల శ్రీరాం..: యువోత్సాహం
పరిటాల తర్వాత అనంతపురం జిల్లాలో టిడిపి నిస్తేజంగా మారిందనే చెప్పవచ్చు. ఆ జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం తీసుకు రావడానికి రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల సతీమణి సునీత ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె తన తనయుడు పరిటాల శ్రీరాంను పరిచయం చేసినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో శ్రీరాంకు ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఉండదు. అయితే యువతను టిడిపి వైపు లాగేందుకే అధిష్టానం సూచనల మేరకు శ్రీరాంను తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిటాల తర్వాత దాదాపు నిరుత్సాహంతో ఉన్న పార్టీ క్యాడర్ సేవా కార్యక్రమాల పేరుతో శ్రీరాం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. శ్రీరాం రాకతో జిల్లా కార్యకర్తల్లో నూతనోత్సాహం రావడంతో పాటు యువత నుండి కూడా మద్దతు బాగానే లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీరాం పోటీ చేయకున్నప్పటికీ జిల్లాలో ప్రచారం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ టిడిపి నేత వల్లభనేని వంశీ కూడా శ్రీరాం రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటించినప్పుడు నారా వారసులు నారా లోకేష్, నారా రోహిత్ ఫోటోలు ఫ్లెక్సీల్లో ప్రముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఓ వైపు యువతను ఆకర్షించడానికి ఇలాంటి వారు రంగంలోకి దిగుతుండగానే, చంద్రబాబు రైతు పోరు బాట తదితర యాత్రల రుతో ప్రజల్లోకి వెళుతూ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే బాలయ్య ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండగా, పరిటాల శ్రీరాం వంటి యువకుల ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.