జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై వేటు వేళాయెరా
ఈనెల 22 నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నందున ఆ రోజే జగన్వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని కొందరు నేతలు అంటున్నారు. మరికొందరు దీంతో విభేదిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీలోగా జగన్ అక్రమాస్తుల కేసుపై న్యాయస్థానంలో సీబీఐ అధికారులు చార్జిషీటును దాఖలు చేయాలి. ఆలోగా జగన్ను అరెస్టు చేయాల్సి రావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దానివల్ల వెంటనే ఉప ఎన్నికలు వస్తే సానుభూతి పనిచేయవచ్చునని అంటున్నారు. అందువల్ల జగన్ వర్గం శానససభ్యులపై వేటుకు మరింత జాప్యం జరగవచ్చునని అంటున్నారు.
జగన్వర్గ ఎమ్మెల్యేలపై మార్చి మొదటి వారంలో అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల నిర్వహణకు ఆగస్టు వరకూ గడువు ఉంటుందని అంటున్నారు. అప్పటిలోగా జగన్ వెంట ఉండేవారెందరో బయటకు వచ్చేవారెవరో స్పష్టం అవుతుందని, పైగా అరెస్టయిన కొత్తలో ఉన్న సానుభూతి క్రమంగా తగ్గుతుందని కూడా అంటున్నారు.దీని వల్ల ఉప ఎన్నికల్లో విజయం సులువని పేర్కొంటున్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల ఫలితాల కంటే సీమాంధ్రలో జగన్వర్గ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో వచ్చే ఫలితాలు కీలకం కానున్నాయి. దీంతో ఈ 17 నియోజకవర్గాల్లో ఎంత ఆలస్యంగా ఉప ఎన్నికలు జరిగితే తమకు అంత మంచిదని కాంగ్రెస్ నేతలంటున్నారు.