తెలంగాణ: కిరణ్ సహకారం కోసం అధిష్టానం

ఈ నెల 28న సిడబ్ల్యూసి సమావేశం నిర్వహించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు నేతలతో అంతకుముందే దీనిపై చర్చించాలని అధిష్టానం భావిస్తోందట. శుక్రవారం ఉదయం 10 గంటల కల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని వారికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ద్వారా సమాచారం పంపించారు. దామోదర ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.
కిరణ్, బొత్స శుక్రవారం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశంలో సిడబ్ల్యూసి భేటీ అజెండాను ఖరారు చేయనున్నారు. ఈ లోపే ముగ్గురు నేతలతో చర్చించాలని నిర్ణయించుకున్నారు. కోర్ కమిటీ భేటీకి మరోసారి వారిని ఆహ్వానించే అవకాశాలు లేవని, అంతకుముందే విడిగానో, మూకుమ్మడిగానో వారితో చర్చించాలని నిర్ణయించుకున్నారట. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎదురు తిరిగే అవకాశం ఉండదని, అందువల్ల పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి గట్టిగా చెప్పేందుకే ఢిల్లీకి పిలిపిస్తున్నారని సమాచారం.
ముఖ్యంగా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న, విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రికి అధిష్ఠానం స్పష్టమైన సంకేతాలు పంపే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దామోదర అధినేత్రి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తదితరులను కలిశారు.












Click it and Unblock the Notifications