విజయమ్మ స్థానంలో జగన్: షర్మిల ప్రచార సారథే!

2014 ఎన్నికల్లో జగన్ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి అతను పులివెందుల నుండి పోటీ చేస్తారని, విజయమ్మ మరో స్థానం నుండి పోటీ చేస్తారనే, అలాగే షర్మిల విశాఖ లేదా ఇతర నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతున్న విషయం తెలిసిందే.
అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు శాసన సభ్యురాలిగా ఉన్న విజయమ్మ కానీ, పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న షర్మిల కానీ పోటీ చేసే అవకాశాలు ఏమాత్రం లేవంటున్నారు. వచ్చే ఎన్నికలలో వారు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు మాత్రమే కృషి చేస్తారనే వాదన వినిపిస్తోంది.
కొంతకాలం క్రితం కడప పార్లమెంటు స్థానంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది. దానిపై ఆ పార్టీ నేతలు స్పందిస్తూ.. కడప నుండి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని, అవసరమైతే షర్మిల విశాఖ లేదా ఇతర స్థానం నుండి పోటీ చేస్తారని చెప్పారు. అయితే ఎన్నికల్లో వారు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం మాత్రమే చేయనున్నారట.
దీంతో ప్రస్తుతం విజయమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నుండి జగన్, జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కడప నుండి సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేయనున్నారు. తల్లీకూతుళ్లిద్దరు కూడా పోటీ కోసం కాకుండా పార్టీని అధికారంలోకి తేవాలనే కసితో ఉన్నారట.
గత ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన, మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిల తండ్రి హావభావాలతో ఆకట్టుకుంటున్నారు. ఆమె అందర్నీ ఆప్యాయంగా పలకరించుకుంటూ వెళ్తున్నారు. విజయమ్మ మాటల్లో మొదట్లో తొట్రుపాటి కనిపించినా క్రమంగా అది తగ్గుతోంది. ఈ నేపథ్యంలో వారు వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా పార్టీ ప్రచార బాధ్యతలనే చేపట్టనున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications