కిరణ్కు షాక్: తొలగించాల్సిందే.. కానీ మీ ఇష్టం!

ధర్మానకు హఠాత్తుగా కబురు పంపించడంతో కళంకిత మంత్రులతో మాట్లాడి వారిని తొలగించేందుకే కిరణ్ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన ఆయనకు అదిష్టానం... వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీ ప్రతిష్ఠే ముఖ్యమని, కళంకిత మంత్రులను పక్కకు తప్పించాల్సిందేనని, కేంద్రంలో అలాగే చేశామని, కర్నాటకలో క్లీన్ ఇమేజ్ వల్లనే గెలుపొందామని, ఎపిలో అభియోగాలు నమోదైన ఇద్దరినే కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ తొలగించాలని చెప్పిందట. అలా ఆదేశిస్తూనే అంతిమ నిర్ణయాన్ని ఆయనకే వదిలేసిందట.
అధిష్టానం ఆదేశం... కిరణ్ కబురు నేపథ్యంలో మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలపై మాత్రమే కాకుండా జగన్ అక్రమాస్తుల కేసులో వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ పదవులకూ ముప్పు తప్పదని చెబుతున్నారు. మంత్రులను కాపాడుకునేందుకు అధిష్ఠానం వద్ద కిరణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. వారి తప్పులేదని అధిష్టానం వద్ద వెనుకేసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందట.
ధర్మాన విషయంలో కోర్టు నిర్ణయించే వరకూ వేచిఉండాలని, సబిత శాఖను మాత్రం మారుస్తానని సిఎం చేసిన ప్రతిపాదనతో సోనియాతో సహా పార్టీ పెద్దలెవరూ అంగీకరించలేదట. దీనితో కనీసం రెండువారాల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలను పదేపదే అభ్యర్థించారు. రెండు వారాల సమయం ఇస్తే ఈలోపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావచ్చునని, అప్పుడు మంత్రులపై చర్య తీసుకోవడం మరికొద్ది రోజులు వాయిదా వేసే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల్లో గెలుపునకు ధర్మాన వంటి నాయకులు అవసరమని, లేకపోతే దెబ్బతింటామని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దల వద్ద బలంగా వాదించారు. ఆజాద్ను పదేపదే కలుసుకున్నారు. చివరకు దిగ్విజయ్ సింగ్ ద్వారా కూడా చివరి ప్రయత్నం చేశారు. తాను స్వయంగా వెళ్లి సోనియాను కాని, రాహుల్ను కానీ కలిసి కళంకిత మంత్రులపై చర్యలు వద్దని చెప్పలేనని దిగ్విజయ్ సింగ్చేతులెత్తేశారు. దీంతో సిఎం నిరాశతో హైదరాబాద్ బయలు దేరారు.
మరోవైపు మంత్రుల విషయంలో తక్షణ చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి కాలయాపన వ్యూహం అమలు చేస్తారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వచ్చే వారం ఢిల్లీ వస్తున్న గవర్నర్ నరసింహన్ ద్వారా ఆయన మంత్రుల విషయంలో చివరి ప్రయత్నం చేయవచ్చునని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిరణ్ మంత్రులను వెనుకేసుకు రావడం, అధిష్టానం ససేమీరా అనడంపై జోరుగా చర్చ సాగుతోంది.
ఆ మంత్రులకు రాజకీయ ప్రాబల్యం ఉండడం, వారిని తొలగించడం వల్ల పార్టీ తింటుందనే ముఖ్యమంత్రి వాదనలో అంత పసలేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, ఎవరికి ఎంత ఎంత ప్రాబల్యం ఉన్నా అవినీతి ఆరోపణల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే సూత్రం అవలంబించాలని పార్టీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో కూడా స్పష్టం చేశారు. దీనిపై బొత్సతో కూడా ఢిల్లీ పెద్దలు చర్చించారని... ఆయన కూడా ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏకీభవించలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications