జగన్తో వెళ్లక తప్పదా!?: చంద్రబాబు డైలామా
అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో ఎటువంటి వ్యూహంతో వెళ్లాలన్న అంశంపై పొలిట్ బ్యూరో శనివారం ఒక నిర్ణయానికి రాలేదు. అవిశ్వాసంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో తదుపరి పరిస్థితులను బట్టి పార్టీ వ్యూహాన్ని నిర్ణయించుకోవాలని నిర్ణయించారు. అవిశ్వాసం వ్యవహారంపై ఈ సమావేశంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయినట్లుగా కనిపిస్తోంది.
అవకాశం దొరికిన ప్రతిసారీ జగన్ పార్టీ డబ్బు విరజిమ్మి మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మనను బలహీనపర్చడానికి ప్రయత్నం చేస్తోందని, అలాంటప్పుడు ఆ పార్టీ అడగ్గానే మనం ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని, ఆ పార్టీ పెడితే మనం ఎందుకు బలపర్చాలని, శాసనసభ స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్ పోస్టులకు మనం పోటీపడగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార పార్టీకి మద్దతిచ్చిందని, మనమూ మనకు లాభం ఉందనుకొన్నప్పుడు ప్రజల కోణంలో అవిశ్వాసం గురించి ఆలోచించాలని పలువురు సూచించారు.
మరికొందరు నేతలు భిన్నమైన వాదన వినిపించారు. ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించి దానిని మనం బలపర్చాల్సి వస్తే బాగుండదని, అలాగని దూరంగా ఉన్నా రాజకీయంగా నష్టపోతామని, దానికి బదులు మనమే అవిశ్వాసం ప్రతిపాదిద్దామని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పడిపోయి మద్యంతర ఎన్నికలు వచ్చినా ఫర్వాలేదని, అటూ ఇటూ కాకుండా ఉపఎన్నికలు వస్తేనే చికాకని చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మరోసారి చర్చించాలని నిశ్చయించారు.