సమైక్యంపై మాట నెగ్గలేదా: డిగ్గీతో చిరంజీవి ఢీ!?
సమైక్యాంధ్రపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి మాట అధిష్టానం వద్ద నెగ్గలేదా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర కోసం లేదా హైదరాబాదును శాశ్వత కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు చిరంజీవి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ మాత్రం విభజనపై ముందుకే వెళ్తోంది.
శనివారం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో మాట్లాడుతూ చిరంజీవిని కూడా ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పరిగణలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఓ విలేకరు.. సమైక్యవాదం ముసుగులో ఇవన్నీ చేస్తున్నది చిరంజీవా? బొత్స సత్యనారాయణా? అని ప్రశ్నించారు.

దానిపై లగడపాటి స్పందించారు. గతంలో కూడా తన వ్యాఖ్యలను చిరుకు ఆపాదించి, ఆయనపై అపవాదులు వేశారని గుర్తు చేశారు. వాస్తవానికి విభజన నిర్ణయంపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు, 12 మంది ఎంపీలు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు వెళ్లామని, అప్పుడు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ తమను కలిశారన్నారు.
విభజన ప్రకటన తప్పని చిరంజీవి వారికి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే, ఉత్తరాంధ్రలో ఎలాంటి ఆందోళనలు ఉండవని, దిగ్విజయ్ వాదించారన్నారు. అయితే, 24 గంటలు గడవగానే చిరంజీవి చెప్పింది వాస్తవమైందన్నారు. చిరంజీవిని కూడా దిగ్విజయ్ పరిగణనలోకి తీసుకోలేదంటే తప్పుదోవ పట్టించినవారి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. చిరంజీవికి కుట్రలు, మీడియా మేనేజ్మెంట్ తెలియదన్నారు.












Click it and Unblock the Notifications