Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రపతి పోల్ పాలిటిక్స్: కెసిఆర్ సైతం కీలకమే, వారేం చేస్తారు?

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం మరో మూడు నెలల్లో ముగియనున్నది. ఆయన వారసుడి ఎంపికపై అధికార బీజేపీ, దానికి సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనస్సులో ఏమున్నదన్న విషయం ఇంకా బయటకు ర

న్యూఢిల్లీ: ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం మరో మూడు నెలల్లో ముగియనున్నది. ఆయన వారసుడి ఎంపికపై అధికార బీజేపీ, దానికి సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనస్సులో ఏమున్నదన్న విషయం ఇంకా బయటకు రాలేదు.

కానీ పరోక్షంగా మాత్రం పార్టీలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులకు 'అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు విచారణ పేరిట' ముందరికాళ్ల బంధం వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన మనో ఫలకంపై తదుపరి రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారా? లేదా? అన్నది మోదీ బహిరంగ ప్రకటన చేస్తే గానీ అసలు సంగతి తేలదు.

అయితే ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడంతో విపక్షాల్లో మాత్రం తమ మనుగడపై వేడి పుట్టిందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీకి జోరుకు ముకుతాడు వేయాలంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపడంతో మోదీ దూకుడును అడ్డుకోగలమని విపక్షాలు భావిస్తున్నాయి. తద్వారా రెండేళ్లలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరులో విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి వీలు చిక్కుతుందని భావిస్తున్నాయి.

రేసులోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు

రేసులోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు

తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం కేంద్రంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎన్నికపై సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మరాఠా యోధుడు.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ మిత్రపక్షం శివసేన ముందుకు తేవడం గమనార్హం. మరోవైపు బీహార్‌లో అధికారంలో ఉన్న యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) అధికార ప్రతినిధి కేసీ త్యాగి కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దేశ వ్యాప్తంగా నూతన రాష్ట్రపతి ఎవరు? అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే ‘విశేష అనుభవం, అర్హతలు ఉన్న జేడీయూ జాతీయాధ్యక్షుడు, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడు' అని వ్యాఖ్యానించారు. జేడీయూతోపాటు భావసారూప్యమున్న పార్టీలు నితీశ్‌ రాష్ట్రపతి బరిలో నిలవాలని కోరుకుంటున్నాయని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

విపక్షాలతో చర్చలకు ఉద్ధవ్ థాకరే సిద్ధమే

విపక్షాలతో చర్చలకు ఉద్ధవ్ థాకరే సిద్ధమే

జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ప్రతిపాదన ఎలా ఉన్నా ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ అభ్యర్థిత్వం కూడా విపక్షాల పరిశీలనలో ఉన్నట్లే మరాఠా యోధుడిగా పేరొందిన శరద్ పవార్ పేరు తీవ్రంగా పరిగణిస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఎన్డీయే మిత్రపక్షం పవార్ అభ్యర్థిత్వాన్ని ముందుకు తేవడంతోపాటు పవార్‌ అభ్యర్థిత్వంపై విపక్షాల్లో ఓ అవగాహన కుదిరినట్లయితే దీనిపై చర్చల్లో తమ పార్టీ అధినేత ఉద్దవ్‌ ఠాక్రే పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీకి శివసేన ప్రతివ్యూహమా?

బీజేపీకి శివసేన ప్రతివ్యూహమా?

సంజయ్ రౌత్ ప్రతిపాదనపై శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స్పందించలేదు. అంతకుముందు మాత్రం తమ అధినేత పవార్.. రాష్ట్రపతి పదవి రేసులో లేరని పేర్కొనడం గమనార్హం. మిత్రపక్షం శివసేనతో ఉన్న విభేదాల నేపథ్యంలో పవార్‌కు దగ్గర కావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఒకవేళ మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్సీపీ మద్దతు కూడగట్టాలని కమలనాథులు ప్రతివ్యూహం రూపొందించుకున్నారని తెలుస్తున్నది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే బీజేపీ, దాని మిత్ర పక్షం శివసేన తమ అధికార, స్వార్థ ప్రయోజనాల కోసం దేశ భవితవ్యాన్ని నిర్దేశించే రాష్ట్రపతి ఎన్నికలను వినియోగించుకోవడమే.

శివసేన తాజా ప్రతిపాదనతో బీజేపీకి ఇబ్బందులేనా

శివసేన తాజా ప్రతిపాదనతో బీజేపీకి ఇబ్బందులేనా

దాదాపు 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. లోక్ సభలో మెజారిటీ కలిగి ఉండటం.. ఇప్పటివరకు శివసేన మద్దతు ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎలక్టోరల్ కాలేజీలో 25 వేల ఓట్లు తక్కువ పడతాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే, తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ఒడిశాలోని సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తున్న బీజేపీకి శివసేన తాజా ప్రతిపాదన తప్పనిసరిగా తలబొప్పి కట్టించేదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వాజ్ పేయి హయాంలో పవార్‌కు ఇలా..

వాజ్ పేయి హయాంలో పవార్‌కు ఇలా..

అలాగని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పట్ల బీజేపీకి గానీ, ప్రధాని నరేంద్రమోదీకి గానీ వ్యతిరేకభావం లేదు. గతంలో 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిత్వానికి పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తూ బయటకు వచ్చి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించిన ఘనత శరద్ పవార్‌దే. కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా నిలబడి పార్టీని కూడా ఇప్పటి వరకు కాపాడుకోగలిగారు. సోనియాగాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన శరద్ పవార్‌ను మంచి చేసుకునేందుకు బీజేపీ గానీ, శివసేన గానీ ప్రయత్నించడం ఇదేమీ కొత్త కాదు. 1999లో సోనియాను వ్యతిరేకించినందుకు గాను నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి.. పవార్‌కు జాతీయ ప్రక్రుతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడం గమనార్హం.

2012లో యూపీయేకు ఇలా శివసేన మద్దతు

2012లో యూపీయేకు ఇలా శివసేన మద్దతు

2007లో యూపీఏ మిత్రపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా, నాటి రాజస్థాన్ గవర్నర్ ప్రతిభా పాటిల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలోనూ శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు. లెఫ్ట్ పార్టీల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో మహిళను రాష్ట్రపతిగా ఎందుకు నిలుపరాదని ఆయన వాదించారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనికితోడు మహారాష్ట్రకు చెందిన నాయకురాలు గనుక శివసేన మద్దతు కొట్టేయవచ్చని కూడా నాడు పవార్ అంచనా వేశారు. తదనుగుణంగానే నాటి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా, యూపీఏ అభ్యర్థిగా ప్రతిభాపాటిల్‌కు శివసేన జై కొట్టింది. అంతేకాదు 2012లోనూ ప్రణబ్ అభ్యర్థిత్వం విషయంలోనూ అంతే జరిగింది. నేరుగా ప్రణబ్ ముఖర్జీ.. శివసేనాధిపతి బాల్ థాకరేతో ఫోన్‌లో సంప్రదించి మద్దతు కూడగట్టారు. అయితే ప్రస్తుతం శివసేన తాజా ప్రతిపాదనకు పోటీగా బీజేపీ.. మరాఠీ ఆడబడుచుగా ఉన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యర్థిత్వాన్ని ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఆ ఆరు పార్టీలకు 13 శాతం ఓటింగ్

ఆ ఆరు పార్టీలకు 13 శాతం ఓటింగ్

వచ్చే జూలై 25న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్థానే ఆయన వారసుడు ఎవరు ఎన్నికవుతారన్నది జాతీయ స్థాయిలో ప్రధాన చర్చగా మారింది. తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్, తెలంగాణలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్), హర్యానాలోని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ) పార్టీలు కీలకం కానున్నాయి. ఈ పార్టీలన్నింటికి కలిపి రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో 13 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. మరో ఆసక్తికర అంశం కూడా ఉన్నది. పంజాబ్‌లో ఆప్ ప్రాతినిధ్యం మినహా మిగతా పార్టీలన్నీ వాటి సొంత రాష్ట్రాల్లోనే ఉనికి కలిగి ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమ దూరం పాటిస్తున్న పార్టీలుగా గుర్తింపు పొందాయి.

మాయా, అఖిలేశ్ కలుస్తారా?

మాయా, అఖిలేశ్ కలుస్తారా?

ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని విపక్షాలకు 35.47 శాతం ఓట్లు ఉన్నాయి. ఆరు పార్టీలకు గల 13.06 శాతం ఓట్లు జత కలిస్తే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని విపక్షాలకు 48.53 శాతం ఓట్లు లభిస్తాయి. ఇక పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న త్రుణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, సీఎం మమతాబెనర్జీ ఎటువైపు మొగ్గుతారన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది. బీజేపీ పోరు సలిపేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ విస్త్రుత ప్రాతిపదికన ఉమ్మడిగా జట్టు కట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం ముందు చతికిల పడిన బీఎస్పీ అధినేత మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా విపక్షాలతో కలువాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు మాయావతి, అటు అఖిలేశ్ యాదవ్ బీజేపీపై పోరుకు కలిసి పనిచేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. కానీ ఎన్డీయేకు ఒక్క పార్టీ మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే శివసేన రూట్ ఎటువైపు అన్నది తేలాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+